అంతర్జాతీయ పరిస్థితుల మార్పులకు అనుగుణంగా భారత్ తన ఇంధన వ్యూహాన్ని వేగంగా మార్చుకుంటోంది. ఈ క్రమంలో అమెరికా నుంచి ముడిచమురు దిగుమతులను గణనీయంగా పెంచింది. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), ఆగస్టులో దాదాపు 20 లక్షల బారెల్స్ అమెరికా ముడిచమురుకు ఆర్డర్ చేసింది. ఈ చమురు అక్టోబర్ నాటికి భారత్కు చేరనుంది.
భారత ప్రభుత్వ విధానం ప్రకారం, ఇంధన అవసరాలకు కొన్ని దేశాలపైనే ఆధారపడకుండా దిగుమతులను వైవిధ్యపరచడం ముఖ్య లక్ష్యం. గతంలో అమెరికా భారత్ ఎగుమతులపై అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కూడా ఈ కొనుగోళ్లు దోహదం చేస్తున్నాయి.
మధ్యప్రాచ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇరాక్ నుండి చమురు దిగుమతులను తగ్గించిన భారత్, ఆ స్థానంలో రష్యా నుండి దిగుమతులు పెంచింది. జూన్, జులై నెలల్లో పెట్టిన ఆర్డర్ల ప్రకారం ఆగస్టులో రోజుకు 20 లక్షల బారెల్స్ రష్యా చమురును కొనుగోలు చేసింది. అయితే రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం కోసం భారత్ అమెరికా వైపు మొగ్గు చూపుతోంది.
అధికారిక గణాంకాల ప్రకారం, ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య అమెరికా నుండి భారత్ చమురు, గ్యాస్ దిగుమతులు 51% పెరిగాయి. ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) దిగుమతులు కూడా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1.41 బిలియన్ డాలర్ల నుంచి 2024-25లో 2.46 బిలియన్ డాలర్లకు చేరాయి.

భారత్-అమెరికా మధ్య వాణిజ్య లోటును తగ్గించేందుకు, 2024లో 15 బిలియన్ డాలర్లగా ఉన్న ఇంధన దిగుమతులను 2025 నాటికి 25 బిలియన్ డాలర్లకు పెంచుతామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దీర్ఘకాలిక ఒప్పందాలపై అమెరికా కంపెనీలతో చర్చలు జరుపుతున్నాయి.
భారత్-అమెరికా సంబంధాలు కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కావని, వ్యూహాత్మక, భౌగోళిక రాజకీయ అంశాలతో కూడా ముడిపడి ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.