Indian Aviation News: విమాన ఇంధన ధరల పెరుగుదలతో విమానయాన సంస్థల కీలక నిర్ణయం..!!
Air India Ticket Prices: మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరల ప్రభావం భారత విమానయాన రంగంపై పడనుంది. ఏప్రిల్ 1 నుండి ATF (విమాన ఇంధనం) ధరల పెంపుతో విమాన టికెట్ల ధరలు ఫ్యూయల్ సర్ఛార్జ్ పెరిగే అవకాశం ఉంది.
Air India Ticket Prices: మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారతీయ సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్ను అతలాకుతలం చేస్తుండటంతో, దీని ప్రభావం నేరుగా విమాన ప్రయాణాలపై పడనుంది. ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో, దేశీయ విమానయాన సంస్థలు ఏప్రిల్ 1 నుంచి టికెట్ ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.
విమాన ఇంధనమే ప్రధాన భారం
సాధారణంగా ఒక విమాన సంస్థ నిర్వహణ ఖర్చుల్లో దాదాపు 40 శాతం వరకు కేవలం ఇంధనం కోసమే ఖర్చవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరిగిన ప్రతిసారీ విమానయాన సంస్థలు ఆ భారాన్ని ప్రయాణికులపైకి నెట్టడం పరిపాటిగా మారింది. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు స్పందిస్తూ.. ప్రతి నెల ఒకటో తేదీన చమురు కంపెనీలు ధరలను సమీక్షిస్తాయని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్ ప్రారంభం నుంచి విమాన ప్రయాణం మరింత ప్రియం కావచ్చని సూచనప్రాయంగా తెలిపారు.
ప్రయాణికులపై 'సర్ఛార్జ్' వడ్డన
ఇప్పటికే ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి అగ్రశ్రేణి సంస్థలు తమ ఇంధన ఖర్చులను తట్టుకోవడానికి 'ఫ్యూయల్ సర్ఛార్జ్' పేరుతో అదనపు బాదుడు మొదలుపెట్టాయి. యుద్ధం గనుక ముదిరితే విమాన మార్గాల్లో మార్పులు చేయాల్సి రావడం, బీమా ఖర్చులు పెరగడం వంటి కారణాల వల్ల టికెట్ ధరలు 15 నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వ ముందస్తు చర్యలు
మరోవైపు, ఈ పెరిగిన ధరల వల్ల సామాన్య ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. విదేశీ వ్యవహారాల శాఖ పెట్రోలియం శాఖలతో కలిసి పౌర విమానయాన శాఖ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. విమాన సంస్థలతో చర్చలు జరిపి, ధరలు అదుపు తప్పకుండా చూడాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, అంతర్జాతీయ సంక్షోభం త్వరగా సర్దుకోకపోతే ఏప్రిల్ నుంచి విమాన ప్రయాణం ఒక విలాసంగా మారే ప్రమాదం ఉంది. వేసవి సెలవుల్లో ప్రయాణాలు ప్లాన్ చేసుకునే వారు, ధరలు మరింత పెరగకముందే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
Be the first to react