దేశ రాజధాని ఢిల్లీలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా సిబ్బందిని నియమించేందుకు డిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు (DSSSB) మరోసారి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న ఈ బోర్డు, పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం 5,346 టీచర్ పోస్టులు ఈ నియామక ప్రక్రియలో భర్తీ చేయనున్నారు. విద్యారంగంలో శాశ్వత ఉద్యోగాన్ని ఆశిస్తున్న వారికి ఇది పెద్ద అవకాశంగా భావిస్తున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో బీఏ, బీఎస్సీ, బీఈడ్, బీఈఐ, ఈడీ లేదా ఫైన్ ఆర్ట్స్/డ్రాయింగ్/పెయింటింగ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాదు, అభ్యర్థులు సీటెట్ (Central Teacher Eligibility Test) పరీక్షలో అర్హత సాధించాలి. ఈ నోటిఫికేషన్ కింద ఇంగ్లిష్, సామాజిక శాస్త్రం, పంజాబీ, సంస్కృతం, ఉర్దూ, గణితం వంటి సబ్జెక్టుల్లో టీచర్ల నియామకాలు జరగనున్నాయి. ప్రతి విభాగంలో అవసరమైన సబ్జెక్ట్ జ్ఞానం, బోధనా నైపుణ్యం కలిగినవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
వయోపరిమితి విషయానికి వస్తే, సాధారణ అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు గరిష్టంగా 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు లభిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు 2025 అక్టోబర్ 9 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ 2025 నవంబర్ 7గా నిర్ణయించారు. సాధారణ వర్గానికి చెందిన అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కల్పించారు.
ఎంపిక ప్రక్రియ పూర్తిగా రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి 7వ వేతన సంఘం ప్రకారం నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు జీతం చెల్లించనున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది అత్యుత్తమ అవకాశం. కావున అర్హత కలిగిన అభ్యర్థులు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని DSSSB సూచించింది.