అంతర్జాతీయ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అరేబియా సముద్ర తీరంలో ఒక ఆధునిక పోర్టును నిర్మించి, నిర్వహించుకునే అవకాశాన్ని అమెరికాకు ఆఫర్ చేస్తూ పాకిస్థాన్ సంచలన ప్రతిపాదన చేసింది. దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, ముఖ్యంగా బలూచిస్థాన్ ప్రాంతంలోని విలువైన ఖనిజ వనరులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయడం ఈ ప్రణాళిక వెనుక ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఆర్థిక పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ ఈ అంశంపై ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఈ కథనం ప్రకారం, బలూచిస్థాన్ ప్రావిన్స్లోని పాస్నీ అనే ఓడరేవు పట్టణంలో అమెరికా పెట్టుబడిదారులు ఒక టెర్మినల్ను నిర్మించి, ఆపరేట్ చేసుకోవచ్చని పాకిస్థాన్ ప్రతిపాదించింది. ఈ పోర్టు ద్వారా బలూచిస్థాన్ ప్రాంతంలోని విలువైన రాగి, బంగారం, లిథియం వంటి ఖనిజాలను సులభంగా తరలించేందుకు సదుపాయం కలుగుతుందని తెలిపింది. దీనివల్ల పాకిస్థాన్కు ఆర్థిక లాభాలు మాత్రమే కాకుండా, అమెరికా పెట్టుబడులు కూడా పెరగనున్నాయని పాక్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలో పాకిస్థాన్ సైన్యం కీలక పాత్ర పోషిస్తోందని ఫైనాన్షియల్ టైమ్స్ స్పష్టంగా పేర్కొంది.
సమాచారం ప్రకారం, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ సలహాదారులు ఇటీవల అమెరికా అధికారులతో రహస్యంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గత నెలలో వైట్హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆర్మీ చీఫ్ భేటీ కావడానికి ముందే ఈ ప్రణాళికను ఆయనకు వివరించినట్లు సమాచారం. అయితే, ఈ ప్రణాళికలో అమెరికా సైనిక స్థావరాల ఏర్పాటు వంటి అంశాలు లేవని పాక్ స్పష్టం చేసినట్లు కథనం పేర్కొంది. కేవలం వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలకే ఈ ప్రాజెక్ట్ పరిమితం అవుతుందని స్పష్టంచేసింది.
ఈ ప్రణాళికలో భాగంగా పశ్చిమ పాకిస్థాన్లోని ఖనిజ వనరులతో కూడిన ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీని మెరుగుపర్చడమే కాకుండా, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహాయాన్ని ఆకర్షించడమే లక్ష్యమని పేర్కొన్నారు. గత నెలలో జరిగిన సమావేశంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా అమెరికా కంపెనీలను వ్యవసాయం, టెక్నాలజీ, మైనింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టమని కోరిన సంగతి తెలిసిందే. అయితే, ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించిన ఈ వార్తను రాయిటర్స్ స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది. ఈ అంశంపై అమెరికా విదేశాంగ శాఖ, వైట్హౌస్, అలాగే పాకిస్థాన్ విదేశాంగ శాఖ స్పందించలేదు. అయినప్పటికీ, ఈ ప్రతిపాదన ప్రపంచ వ్యూహాత్మక రంగంలో కొత్త చర్చలకు దారితీస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.