రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం అందరికీ తెలిసినదే. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన కింద రూ.6,000తో పాటు, రాష్ట్రం తరఫున రూ.14,000ను రైతులకు పెట్టుబడి సాయంగా మూడు విడతలుగా అందజేస్తున్నారు.
ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత నిధులను విడుదల చేస్తూ దాదాపు 46 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,000 చొప్పున జమ చేసింది. ఇంకా ఈ-కేవైసీ, ఎన్పీసీఐ లింకింగ్ పూర్తిగా చేయని రైతులకు మరో అవకాశం కూడా ఇచ్చింది. వీటిని పూర్తి చేస్తే, వారి ఖాతాల్లోనూ నిధులు జమ చేస్తారు.
అయితే ఇదే అవకాశాన్ని కొంతమంది సైబర్ మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో ఏపీకే ఫైళ్లను పంపిస్తూ, ఫోన్ కాల్స్ చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు.
మోసం ఎలా జరుగుతోంది? మొదట వాట్సాప్ ద్వారా “రిజిస్ట్రేషన్ చేసుకోండి” అనే మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఏపీకే ఫైలు ఉండి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలని, లేదంటే డబ్బులు రేవని భయపెడుతారు. రైతులు ఫైల్ ఓపెన్ చేస్తే, అది ఫోన్లో ఇన్స్టాల్ అయ్యి హ్యాకింగ్ టూల్గా మారుతుంది. ఆ తర్వాత మొబైల్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్తుంది. వారి చేతికి బ్యాంక్ వివరాలు, పాస్వర్డులు అందిపోతూ, ఖాతాలోని నగదు ఖాళీ అవుతోంది.
రైతులకు హెచ్చరిక: ఈ తరహా మెసేజ్లు వచ్చినప్పుడు, ఏ ఫైలు ఓపెన్ చేయకండి. అధికారిక వెబ్సైట్ లేదా గ్రామ వాలంటీర్ల ద్వారా మాత్రమే సమాచారం పొందండి. అనుమానాస్పద కాల్స్కి స్పందించకండి.