వర్షాకాలం మొదలైనప్పటి నుంచే సీజనల్ వ్యాధులు భయపెడుతున్నాయి. ముఖ్యంగా వర్షాల వల్ల నీరు నిలిచిపోయే ప్రదేశాలు పెరగడంతో దోమల పెరుగుదల అధికమై, డెంగ్యూ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని వైద్య అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఇప్పటికే వందలాది కేసులు నమోదయ్యాయి.
డెంగ్యూ ఎలా వ్యాపిస్తుంది? డెంగ్యూ జ్వరం ఎడిస్ ఈజిప్టి అనే దోమ కాటు ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి. ఈ దోమలు ఎక్కువగా ఉదయం మరియు సాయంత్రం సమయంలో చురుగ్గా ఉండి కాటుకు దిగుతాయి. నిలువ నీరు, చెత్త కుప్పలు, డ్రైనేజులు వంటి ప్రదేశాల్లో ఇవి త్వరగా వృద్ధి చెందుతాయి.
లక్షణాలు ఏమిటి? డెంగ్యూ సోకిన నాలుగు నుంచి 10 రోజుల్లో క్రింది లక్షణాలు కనిపించొచ్చు: అధిక జ్వరం. తీవ్రమైన తలనొప్పి. కీళ్ల, కండరాల నొప్పులు. కళ్ల వెనుక భాగంలో నొప్పి. చర్మంపై దద్దుర్లు. వికారం, వాంతులు
తీవ్ర స్థాయిలో డెంగ్యూ హెమరాజిక్ ఫీవర్గా మారితే: ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం. బీపీ పడిపోవడం. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వంటి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడవచ్చు.
ఎలాంటి జాగ్రత్తలు అవసరం? డెంగ్యూ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. NS1 యాంటిజెన్ టెస్ట్, IgM యాంటీబాడీ టెస్ట్ ద్వారా డెంగ్యూ నిర్ధారణ చేసుకోవచ్చు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. శరీరంలో నీరు తగ్గకుండా ఎక్కువగా నీటి ద్రవాలు (ORS, లిమెట్ జ్యూస్, కొబ్బరినీరు) తీసుకోవాలి. వైద్యుల సూచన మేరకు మాత్రలు మాత్రమే వాడాలి. స్వయంగా దవాఖానలో చికిత్స తీసుకోవడం మేలైనది.
దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు: ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తపడాలి. వర్షపు నీటి డబ్బాలు, ఫ్లవర్ పాట్లు, కూలర్లు శుభ్రంగా ఉంచాలి. దోమతిరిగే నెట్లు, క్రీమ్లు వాడాలి. పిల్లలు, వృద్ధులు ఎలాంటి లక్షణాలు కనిపించినా ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలి.