తెలుగు సినిమా పరిశ్రమను దశాబ్దాలుగా వేధిస్తున్న పైరసీ ముఠాల గుట్టురట్టు చేస్తూ హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరో వెలుగులోకి తెచ్చి సినీ ప్రముఖులకు షాక్ ఇచ్చారు. సినీ హీరోలు ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్ల నిర్వాహకులే పైరసీ ముఠాలకు నిధులు సమకూరుస్తున్నారని వెల్లడించారు. ఈ చేదు వాస్తవం తెలుసుకున్న వెంటనే, భవిష్యత్తులో ఏ బెట్టింగ్ యాప్లకూ ప్రచారం చేయకూడదని టాలీవుడ్ ప్రముఖులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
మంగళవారం నగరంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ అంశాలపై చర్చ జరిగింది. ఈ మీటింగ్లో అగ్రనటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, నాని, నాగచైతన్యతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, పలువురు దర్శకులు, డిజిటల్ మీడియా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. సైబర్ క్రైమ్ పోలీసులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పైరసీ ముఠాల పనితీరును, డబ్బు లావాదేవీలను, టెక్నికల్ లోపాలను వివరించారు. సినిమాలు రిలీజ్ కాకముందే హెచ్డీ ప్రింట్లు ఎలా బయటకు వస్తున్నాయో చూసి సినీ ప్రముఖులు ఆశ్చర్యపోయారు.
పోలీసుల వివరాల ప్రకారం, డిజిటల్ మీడియా సంస్థల సర్వర్లలో ఉన్న బలహీనమైన సైబర్ భద్రత వల్లే ఈ సమస్య మరింత పెరిగింది. హ్యాకర్లు సర్వర్లలోకి చొరబడి, థియేటర్లకు వెళ్లకముందే సినిమాలను దొంగిలించి పైరసీ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తున్నారని తెలిపారు. ఈ హ్యాకర్లకు నిధులు సమకూరుస్తున్నవారు బెట్టింగ్ యాప్ నిర్వాహకులేనని ఆధారాలతో చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే డిజిటల్ మీడియా సంస్థలు తమ సైబర్ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని, సర్వర్ల రక్షణ కోసం అధిక నిధులు వెచ్చిస్తామని హామీ ఇచ్చాయి.
ఈ సందర్భంగా పోలీసులు ఐబొమ్మ వెబ్సైట్పై కూడా దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను అరెస్ట్ చేస్తామని సైబర్ క్రైమ్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి ఆధునాతన పరికరాలను ఉపయోగించి పైరసీ ముఠాలను పట్టుకున్నామని, ఇకపై సినీ పరిశ్రమను కాపాడటానికి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసులు చేస్తున్న కృషిని సినీ ప్రముఖులందరూ ప్రశంసించారు. ఈ సమావేశం తరువాత టాలీవుడ్ లో పైరసీ వ్యతిరేక ఉద్యమం మరింత వేగం అందుకోబోతోందని భావిస్తున్నారు.