ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేట నియోజకవర్గం రూపురేఖలు మారనున్నాయి. ఈ ప్రాంతంలో రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుతో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణుల తయారీ సంస్థ ప్రతినిధులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి, యూనిట్ ఏర్పాటు దిశగా ముందడుగులు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మరికొన్ని డిఫెన్స్ సంస్థలు కూడా ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
ఇక ఈ పరిశ్రమల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2025 మే 19న కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. జగ్గయ్యపేటలో మిసైల్స్, ఆయుధ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తికి కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్రహ్మోస్ ఏరోస్పేస్ సీఎండీ బృందం రెండు సార్లు జగ్గయ్యపేట ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించింది.
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారికి సమీపంలో ఉండటం, రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉండటంతో ఈ ప్రాంతం పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా మారింది. ప్రభుత్వం మరియు ఏపీఐఐసీ వద్ద వేల ఎకరాల భూములు ఖాళీగా ఉండటంతో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు దోహదపడుతోంది. ఇప్పటికే జయంతిపురంలో 800 ఎకరాలు, పెద్దవరంలో 1200 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మోస్ క్షిపణుల తయారీ యూనిట్తో పాటు ఇతర రక్షణ రంగ సంస్థలు కూడా తలంపెడుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ జిల్లాలో రూ.400 కోట్లతో తోళ్ల ఉత్పత్తుల పరిశ్రమను లిడ్ క్యాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జక్కంపూడిలోని జెట్ సిటీలో మొదటి టవర్ను రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డిఫెన్స్ క్లస్టర్, తోళ్ల పరిశ్రమ, జెట్ సిటీ ఇవన్నీ రూపుదిద్దుకుంటే.. ఈ ప్రాంతం పరిశ్రమల హబ్గా మారి, స్థానికులకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి.