రాజధాని అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలోని ప్రధాన ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక సంస్థ (Special Purpose Vehicle – SPV) ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కంపెనీల చట్టం కింద ఏర్పాటు కానున్న ఈ సంస్థకు ప్రారంభంలో రూ.10 వేల కోట్ల అధీకృత షేర్ క్యాపిటల్ ఉండనుంది. ఇందులో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి 99.99 శాతం ఈక్విటీ భాగస్వామిగా, మిగతా 0.01 శాతం సీఆర్డీఏ మరియు ఇతర ప్రభుత్వ సంస్థలకు చెందనుంది.
ఈ ఎస్పీవీ ద్వారా అమరావతిలో పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను చేపట్టనున్నారు. అందులో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం, కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్, నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం, స్మార్ట్ ఇండస్ట్రీలు, స్పోర్ట్స్ సిటీ, రివర్ఫ్రంట్ డెవలప్మెంట్, రోప్వే, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల అమలుతో అమరావతి రాజధానిగా రూపుదిద్దుకునే పనులు వేగవంతం కానున్నాయి. భవిష్యత్తులో చేపట్టే ఇతర ప్రత్యేక ప్రాజెక్టులూ ఈ సంస్థ ఆధ్వర్యంలో అమలుకానున్నాయి.
ఎస్పీవీ పాలన నిర్మాణం కూడా సమగ్రమైన విధంగా నిర్ణయించబడింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తారు. బోర్డు సభ్యులుగా ఆర్థిక, ఇంధన, రవాణా-రోడ్లు, భవనాలు, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులు, సీఆర్డీఏ కమిషనర్ ఉంటారు. అదనంగా పారిశ్రామిక రంగానికి చెందిన ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లను కూడా బోర్డులో చేర్చనున్నారు. అవసరాన్ని బట్టి ప్రభుత్వం బోర్డు సభ్యులను మారుస్తూ ఉంటుంది. ఎస్పీవీకి ఎండీని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి నియమిస్తారు.
ఈ సంస్థ ప్రధాన బాధ్యతలు కూడా స్పష్టంగా నిర్దేశించబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏలతో సమన్వయం చేస్తూ ప్రాజెక్టుల రూపకల్పన, అభివృద్ధి, అమలు బాధ్యతలు వహిస్తుంది. ప్రాజెక్టులకు సంబంధించిన కొత్త కాన్సెప్ట్లు, ఫీజిబిలిటీ రిపోర్టులు, డీపీఆర్లు, ఆర్థిక నమూనాలను రూపొందించి ప్రభుత్వ అనుమతులు పొందడం దీని బాధ్యతల్లో భాగం. అదేవిధంగా పీపీపీ, ఈపీసీ, హైబ్రిడ్ యాన్యుటీ వంటి మోడళ్ల ద్వారా కాంట్రాక్ట్ సంస్థల ఎంపిక, నిర్మాణం, నిర్వహణ పనులు చేపడుతుంది. ఈ చర్యతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు మరింత వేగం సంతరించుకునే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.