ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ముందు ఇచ్చిన ప్రధాన హామీలలో ఒకటి 20 లక్షల ఉద్యోగాల సృష్టి. ఆ హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. కొత్త పరిశ్రమలను రాష్ట్రంలోకి తీసుకురావడంతో పాటు, నిరుద్యోగులకు అవకాశాలు కల్పించే దిశగా జాబ్ మేళాలను కూడా నిర్వహిస్తోంది.
ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒక భారీ జాబ్ మేళా జరగనుంది. ఇందులో ఐటీసీ, టాటా, ఫాక్స్కాన్, రేమండ్స్, ర్యాపిడో వంటి 10 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ కంపెనీలు విభిన్న విభాగాలలో అనేక ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి.
ఉద్యోగాల విషయానికొస్తే మెషీన్ ఆపరేటర్, మెయింటెయినర్, జూనియర్ టెక్నీషియన్, టికెట్ కౌంటర్ రైడ్ ఆపరేటర్, కస్టమర్ సపోర్ట్, టీమ్ లీడర్, జూనియర్ చెఫ్, హెచ్ఆర్ ట్రెయినీ, డెలివరీ పార్ట్నర్ వంటి పోస్టులు ఉన్నాయి. వీటికి కనీసం నెలకు ₹14,000 నుండి గరిష్టంగా ₹75,000 వరకు జీతభత్యాలు ఉంటాయి. దాదాపు 2,200 ఉద్యోగాలు ఈ జాబ్ మేళా ద్వారా లభ్యం కానున్నాయి.
ఈ అవకాశానికి 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం https://naipunyam.ap.gov.in/user-registration వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించారు. ఆన్లైన్ ద్వారా సులభంగా నమోదు చేసుకునే అవకాశం ఉండడం వల్ల అనేక మంది అభ్యర్థులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది.
ఇక జాబ్ మేళాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారులు ప్రత్యేక నంబర్లను కూడా అందుబాటులో ఉంచారు. పి. శ్రావణి (9347372996), ఎస్.కె. బాజీ (7780588993) లను సంప్రదించవచ్చు. అదనంగా నేరుగా 9988853335 నంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ప్రభుత్వం నిరుద్యోగుల కోసం విస్తృత స్థాయిలో అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తోంది.