ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు శుభవార్త చెప్పారు. ఇప్పటివరకు విద్యుత్ శాఖ నుంచి వచ్చే అప్డేట్లు వినియోగదారులపై భారంగా మిగిలేవి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. వినియోగదారులపై ట్రూఅప్ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. దాంతో రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు రూ. 923.55 కోట్ల ఊరట లభించనుంది. దీనిపై ఏపీఈఆర్సీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను డిస్కంలు దాఖలు చేసిన ట్రూఅప్ మొత్తానికి సంబంధించి ఏపీఈఆర్సీ రూ. 1,863.64 కోట్లకు మాత్రమే ఆమోదం తెలిపింది. అయితే డిస్కంలు వినియోగదారుల నుంచి వసూలు చేసిన మొత్తం రూ. 2,787 కోట్లు. దీంతో ఆమోదించిన మొత్తానికి మించి వసూలైన రూ. 923.55 కోట్లను వినియోగదారులకు తిరిగి చెల్లించాలని నిర్ణయించింది. దీనిని ట్రూడౌన్ రూపంలో అమలు చేస్తారు. ఈ నిర్ణయం వల్ల సాధారణ వినియోగదారుల బిల్లులు కొంతవరకు తగ్గి ఊరట లభించనుంది.
అధికారుల ప్రకారం, ట్రూడౌన్ చార్జీల రూపంలో వచ్చే నవంబర్ 2025 నుంచి అక్టోబర్ 2026 వరకు విద్యుత్ బిల్లుల్లో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేయనున్నారు. దీని వల్ల యూనిట్కు 13 పైసలు తగ్గింపు లభిస్తుంది. అంటే గత ఏడాది 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు వినియోగదారులు ఉపయోగించిన యూనిట్లకు అనుగుణంగా లెక్కకట్టి, రాబోయే నెలవారీ బిల్లుల్లో తగ్గింపు జమ అవుతుంది. ఉదాహరణకు, ఎవరు గతేడాది 100 యూనిట్లు వినియోగించి ఉంటే, వారి బిల్లులో రూ.13 తగ్గింపు లభిస్తుంది.
సాధారణంగా ట్రూఅప్ అంటే ఖర్చులు పెరిగితే వినియోగదారులపై అదనపు భారం మోపడం. కానీ ఈసారి తొలిసారి రాష్ట్రంలో ట్రూడౌన్ (ఛార్జీల తగ్గింపు) అమలు కానుంది. డిస్కంలకు అనుమతించిన ఖర్చు కన్నా తక్కువ ఖర్చు అయ్యే పరిస్థితుల్లో, ఆ మిగిలిన మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి జమ చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లలో తీసుకున్న చర్యల వల్ల ఈ అవకాశం దక్కిందని అధికారులు పేర్కొన్నారు. ఈ నిర్ణయం విద్యుత్ వినియోగదారులకు పెద్ద ఊరటగా భావిస్తున్నారు.