Weather Update: జూన్లో తక్కువ వర్షాలు.. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పెరగనున్న వడగాడ్పుల తీవ్రత!
Weather Update: ఈ ఏడాది దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన తాజా నివేదికలో వెల్లడించింది.
- Environment: దీర్ఘకాల సగటులో 90 శాతం వర్షపాతమే నమోదయ్యే సూచనలు..
- దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకు అవకాశం..
Weather Updateఈ: ఏడాది దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. 2026 రుతుపవనాలకు సంబంధించి విడుదల చేసిన దీర్ఘకాలిక అంచనాల ప్రకారం, జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షపాతం దీర్ఘకాల సగటు (ఎల్పీఏ)లో కేవలం 90 శాతానికి పరిమితం కావొచ్చని తెలిపింది. ఈ అంచనాల్లో 4 శాతం అటూఇటూగా మార్పులు ఉండొచ్చని పేర్కొంది. దీంతో ఈసారి వర్షపాతం 'సాధారణం కంటే తక్కువ' కేటగిరీలోకి వస్తుందని, ఇది వ్యవసాయ రంగం, జలవనరులు, దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఈ అంచనాలకు ప్రధాన కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్ నినో పరిస్థితులను ఐఎండీ పేర్కొంది. ఎల్ నినో సాధారణంగా రుతుపవన వ్యవస్థను బలహీనపరుస్తుంది. మరోవైపు, రుతుపవనాలకు మేలు చేసే ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐఓడీ) ప్రస్తుతం తటస్థంగా ఉందని, రుతుపవన కాలంలో కూడా అలాగే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిస్థితులునేపథ్యంలో, ఈ సీజన్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు 84 శాతం అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఇటీవలి సంవత్సరాలలో ఇది అత్యంత బలహీనమైన రుతుపవన సీజన్లలో ఒకటిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది.
ప్రాంతాల వారీగా చూస్తే.. దేశంలోని అధిక వర్షాధార వ్యవసాయ ప్రాంతాలు ఉండే 'మాన్సూన్ కోర్ జోన్'లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. ఈశాన్య భారతంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండగా, వాయువ్య, మధ్య, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో లోటు వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది. అయితే, వాయువ్య, ఈశాన్య, తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు దక్షిణ ద్వీపకల్పంలోని తూర్పు భాగాలలో అక్కడక్కడా సాధారణం నుంచి అధిక వర్షపాతం కురవవచ్చని పేర్కొంది.
ఇక, జూన్ నెలకు సంబంధించి దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ హెచ్చరించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్ వంటి పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వడగాడ్పులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నీటి యాజమాన్య పద్ధతులు, కరవును తట్టుకునే విత్తనాల ఎంపిక వంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సలహా ఇచ్చింది. జులై నెలకు సంబంధించిన పూర్తిస్థాయి అంచనాలను జూన్ చివరి వారంలో విడుదల చేయనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.
వాతావరణ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం, పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే ఎల్ నినో ప్రభావం భారత ఉపఖండంపై తీవ్రంగా మారనుంది. వర్షాలు సకాలంలో పడకపోతే ఖరీఫ్ సీజన్ పంటల సాగు గణనీయంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వరి, పత్తి, పప్పుధాన్యాల వంటి ప్రధాన పంటల దిగుబడి తగ్గి, మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటుతున్న తరుణంలో, వాతావరణ శాఖ ఇచ్చిన ఈ హెచ్చరికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు కరవు నివారణ చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ వనరులను సిద్ధం చేసుకోవడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాలను మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఏర్పడే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు వీలుగా పట్టణ, గ్రామీణ ప్రజలు కూడా ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడుకోవాలని వాతావరణ నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Be the first to react