Heatwave: 16 జిల్లాల్లో ఎండ తీవ్రత.. కొన్ని చోట్ల పిడుగులతో వర్షాలు!
Heatwave: ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మార్మోగుతోంది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన అకాల వర్షాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం..
నెల్లూరు జిల్లాలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత..
ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మార్మోగుతోంది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన అకాల వర్షాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, రేపు మరియు ఎల్లుండి కూడా ఇదే తరహా పరిస్థితులు కొనసాగనున్నాయని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఎండలు కొనసాగుతుండగా, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బుధవారం నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం 28 జిల్లాల్లో 16 జిల్లాల పరిధిలోని 88 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం.
ఇవాళ నమోదైన ముఖ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి: కొమ్మిపాడు (నెల్లూరు) – 44.1°C, దేవరపల్లి (అనకాపల్లి) – 43.4°C, బెల్లంకొండ (పల్నాడు) – 43.3°C, నందనమారెళ్ళ (మార్కాపురం) – 43.2°C, గంగవరం (చిత్తూరు) – 42.8°C, నగరడోన (కర్నూలు) – 42.7°C, దొరవారిసత్రం (తిరుపతి) – 42.5°C, తొర్రగుడిపాడు (ఎన్టీఆర్) – 42.4°C, మక్కువ (మన్యం), వీఆర్ పురం (పోలవరం) – 42.2°C, చాగలమర్రి (నంద్యాల), కొప్పెరపాడు (ప్రకాశం), లింగాల (వైఎస్సార్ కడప) – 42.1°C, రాయదుర్గం (అనంతపురం) – 42°Cగా నమోదయ్యాయి.
గురువారం (30-04-2026) మరింత జాగ్రత్త అవసరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి, బొండపల్లి, రామభద్రాపురం మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం మండలాలు, అలాగే అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అదనంగా మరో 20 మండలాల్లో సాధారణ వడగాల్పులు ఉండే సూచనలు ఉన్నాయి.
ఇక మరోవైపు ద్రోణి ప్రభావంతో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రైతులు, పశుకాపరులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉరుములు, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎండలతో పాటు అకాల వర్షాల మిశ్రమ వాతావరణం కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. అధికారులు సూచనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
Be the first to react