16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగం ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయని న్యాయస్థానాలు గుర్తిస్తున్నాయి . ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఒక కీలక సూచన చేసింది. సోషల్ మీడియా కారణంగా పిల్లల మానసిక ఆరోగ్యం, శారీరక అభివృద్ధి తీవ్రంగా దెబ్బతింటోందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా చిన్న వయసులోనే పిల్లలు అశ్లీల కంటెంట్, హింసాత్మక వీడియోలు, తప్పుదారి పట్టించే సమాచారానికి గురవుతున్నారని పేర్కొంది. ఈ పరిస్థితులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఇంటర్నెట్ వినియోగం పెరిగిన కొద్దీ పిల్లలు తెలియకుండానే అనేక రకాల డిజిటల్ ప్రమాదాల్లో పడుతున్నారని కోర్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికల ద్వారా పిల్లల్లో ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం పెరుగుతోందని, ఇది వారి చదువుపై కూడా ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించింది. ఈ అంశాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును విచారించిన ధర్మాసనంలో జస్టిస్ జి. జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్ ఉన్నారు.
ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకూడదని చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసిందని పేర్కొంది. అదే తరహాలో భారతదేశంలో కూడా ఇలాంటి చట్టం అవసరమా అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. కొత్త చట్టం వచ్చే వరకు ప్రస్తుతం ఉన్న ఐటీ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది.
పిల్లలు ఇంటర్నెట్ను ఎలా ఉపయోగిస్తున్నారు అన్నదానిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. పిల్లల చేతిలో స్మార్ట్ఫోన్ ఇచ్చినంత మాత్రాన బాధ్యత ముగిసినట్టుకాదని, వారి ఆన్లైన్ కార్యకలాపాలను గమనించాల్సిందేనని చెప్పింది. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లలో పేరెంటల్ కంట్రోల్ యాప్లు తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించింది. ఈ యాప్ల వాడకం గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లదేనని కోర్టు అభిప్రాయపడింది.
పాఠశాలల్లో పిల్లలకు చైల్డ్ రైట్స్, ఇంటర్నెట్ భద్రతపై పాఠాలు చెబుతున్నా అవి సరిపోవడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రాక్టికల్ అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. ఈ విషయంలో జాతీయ, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లు మరింత చురుకుగా వ్యవహరించాలని కోర్టు కోరింది.
అదే సమయంలో అభ్యంతరకరమైన వెబ్సైట్లు, అనుచిత వీడియోలు, హానికరమైన కంటెంట్ను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు తరచూ సమీక్షించి బ్లాక్ చేయాలని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. పిల్లల భద్రత అనేది కేవలం కుటుంబాల బాధ్యత మాత్రమే కాదని, ప్రభుత్వాలు, సంస్థలు, సమాజం మొత్తం కలిసి బాధ్యత తీసుకోవాల్సిన అంశమని పేర్కొంది. డిజిటల్ యుగంలో పిల్లలను కాపాడాలంటే బలమైన చట్టపరమైన రక్షణలు తప్పనిసరని హైకోర్టు స్పష్టంగా చెప్పింది.