శేషాచలాన్ని తలపించిన శుక్రవారపుతోట..
మే 1న స్వర్ణరథోత్సవం..
తిరుపతి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు గురువారం భక్తి పరవశంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మే 1న ఉదయం 9.30 గంటలకు స్వర్ణరథోత్సవం కన్నులపండువగా జరగనుండటం విశేషం.
వసంత ఋతువులో సూర్యుడు మేషరాశిలో అధిక ప్రభావంతో ప్రకాశిస్తాడని, ఈ సమయంలో వచ్చే వేడి వల్ల మనుషులకు అనేక శారీరక ఇబ్బందులు కలుగుతాయని భావిస్తారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధిస్తే భక్తులకు శారీరక, మానసిక శాంతి లభిస్తుందని విశ్వాసం.
ఉత్సవాల తొలి రోజున ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేసి అమ్మవారిని అలంకరించారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు.
ఈసారి శుక్రవారపు తోటను శేషాచలం అడవిని తలపించేలా ప్రత్యేకంగా అలంకరించారు. టీటీడీ ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పచ్చని చెట్లు, రంగురంగుల పుష్పాలు, జంతువుల ఆకృతులతో తోటను అందంగా తీర్చిదిద్దారు. ఆవు, దూడ, కోతి, నెమలి, హంసలు, చిలుకల రూపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ అలంకరణ కోసం సుమారు 300 కేజీల వట్టి వేరు, 500 కేజీల సంప్రదాయ పుష్పాలు, 15 వేల కట్ ఫ్లవర్స్ వినియోగించారు. బెంగళూరు, హైదరాబాద్కు చెందిన నిపుణులతో పాటు టీటీడీ సిబ్బంది కలిసి ఈ అందమైన వాతావరణాన్ని సృష్టించారు. ఇదే సమయంలో అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు కూడా భక్తులను అలరించాయి.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు పణబాక లక్ష్మీ, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్లు ముని చెంగల్రాయులు, రమేష్, సురేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ చలపతి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి కటాక్షాలను పొందారు.