కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కార్వార్ తీరంలో చోటుచేసుకున్న ఓ వింత ఘటన దేశవ్యాప్తంగా ఆసక్తితో పాటు ఆందోళనను కూడా కలిగిస్తోంది. దేశ భద్రత పరంగా అత్యంత కీలకమైన నావికా స్థావరం ఉన్న ఈ ప్రాంతంలో, చైనాకు చెందిన జీపీఎస్ ట్రాకర్ అమర్చిన ఒక వలస సముద్రపు పక్షి (సీగల్) గాయపడిన స్థితిలో కనిపించడం కలకలం రేపింది. సాధారణంగా వలస పక్షులపై శాస్త్రీయ పరిశోధనల కోసం ట్రాకర్లు అమర్చడం జరుగుతుంటుంది. అయితే వ్యూహాత్మకంగా కీలకమైన నావికా స్థావరం సమీపంలో ఈ పక్షి కనిపించడం భద్రతా కోణంలో అనేక అనుమానాలకు దారితీసింది.
మంగళవారం రోజున కార్వార్లోని రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్ వద్ద గస్తీ నిర్వహిస్తున్న కోస్టల్ మెరైన్ పోలీసులు ఈ గాయపడిన పక్షిని గుర్తించారు. పక్షి కదలలేని స్థితిలో ఉండటంతో వెంటనే దాన్ని రక్షించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అధికారులు పక్షికి చికిత్స అందిస్తూ పరిశీలించగా, దాని శరీరానికి ఒక జీపీఎస్ ట్రాకింగ్ పరికరం అమర్చినట్లు గుర్తించారు. ఆ పరికరానికి చిన్న సోలార్ ప్యానెల్ కూడా ఉండటం గమనార్హం. దీని ద్వారా పక్షి కదలికలను దీర్ఘకాలం పర్యవేక్షించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ట్రాకింగ్ పరికరంపై ఒక ఈమెయిల్ ఐడీతో పాటు “ఈ పక్షి కనిపిస్తే దయచేసి ఈ ఐడీకి సమాచారం ఇవ్వండి” అనే సందేశం కూడా ఉంది. పోలీసులు ఆ ఈమెయిల్ ఐడీని పరిశీలించగా, అది చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్కు చెందిన ‘రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకో–ఎన్విరాన్మెంటల్ సైన్సెస్’ అనే సంస్థకు సంబంధించినదిగా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ పక్షిపై ట్రాకర్ అమర్చడం పూర్తిగా శాస్త్రీయ పరిశోధన కోసమా? లేక మరేదైనా గూఢచర్య కోణం ఉందా? అనే అంశాలపై స్పష్టత కోసం సంబంధిత సంస్థను సంప్రదించే ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ ఘటనపై ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీ దీపన్ ఎంఎన్ స్పందిస్తూ, “వలస పక్షుల కదలికలను అధ్యయనం చేయడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న శాస్త్రీయ ప్రక్రియే. కానీ దేశానికి వ్యూహాత్మకంగా కీలకమైన నావికా స్థావరం సమీపంలో ఈ పక్షి కనిపించడం నేపథ్యంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం” అని తెలిపారు. భద్రతా ఏజెన్సీలు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని పక్షి ప్రయాణ మార్గం, ట్రాకర్ డేటా, దాని ఉపయోగం వంటి అంశాలపై సమగ్రంగా పరిశీలిస్తున్నాయి. ఈ ఘటన మరోసారి సముద్రతీర భద్రత, వలస పక్షులపై విదేశీ ట్రాకింగ్ పరికరాల అంశంపై చర్చకు దారితీసింది.