Education: విద్య ద్వారానే పేదల సాధికారత.. సీఎం లక్ష్యాన్ని వివరించిన మంత్రి డోలా!
Education: పేద కుటుంబాల పిల్లలు కూడా నాణ్యమైన విద్యను పొందుతూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు..
ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్ల విస్తరణకు ప్రభుత్వం కృషి..
విజయవాడ: పేద కుటుంబాల పిల్లలు కూడా నాణ్యమైన విద్యను పొందుతూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లను కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
విజయవాడలోని వి.ఆర్. సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం నిర్వహించిన అంబేద్కర్ గురుకులాల డీసీవోలు, ప్రిన్సిపాళ్లు, సోషల్ వెల్ఫేర్ అధికారుల వర్క్షాప్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యా ప్రమాణాలు, విద్యార్థుల సంక్షేమం, పాఠశాలల నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు.
విద్యార్థులు పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు లక్ష్యంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రతి గురుకులం, సంక్షేమ హాస్టల్లో ‘100 డేస్ యాక్షన్ ప్లాన్’తో పాటు ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు బోధనతో పాటు మెరుగైన వసతులు కల్పించడం కూడా సమానంగా ముఖ్యమని చెప్పారు.
పాఠశాలల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, మరుగుదొడ్లు, హాస్టల్ ప్రాంగణాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించిన మంత్రి, వారి మానసిక పరిస్థితిని కూడా గమనిస్తూ అవసరమైన కౌన్సిలింగ్ అందించాలని తెలిపారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
అదేవిధంగా విద్యతో పాటు నైతిక విలువలను కూడా విద్యార్థులకు బోధించాలని మంత్రి అన్నారు. భవిష్యత్ పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్ల సంఖ్యను 3 నుంచి 10కు పెంచామని, ఈ ఏడాది మరో మూడు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో ఇప్పటికే సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, మెకనైజ్డ్ కిచెన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్లో విద్యార్థులు, తల్లిదండ్రులు సౌకర్యాలు, పరిశుభ్రతపై పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేసేలా అధికారులు పనిచేయాలని సూచించారు.
పేద పిల్లల విద్య కోసం ఎంత ఖర్చైనా భరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. విద్యే పేదరికాన్ని జయించే శక్తివంతమైన ఆయుధమని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గురుకులాల సంస్థ కార్యదర్శి ఐఏఎస్ వి. ప్రసన్న వెంకటేష్, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ ఐఏఎస్ బి. లావణ్య వేణి, అదనపు డైరెక్టర్ సునీల్ రాజ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Tags
Be the first to react