దేశంలోని అతిపెద్ద బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) కు కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా సిబ్బంది కొరత మరియు కొత్త విమానయాన నిబంధనల (FDTL) కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వరుసగా మూడో రోజైన గురువారం కూడా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేయడంతో, వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఇండిగో కార్యకలాపాలు దాదాపు స్తంభించిపోయాయి. గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 170కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యే అవకాశం ఉందని ఎన్డీటీవీ కథనం పేర్కొంది. ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన 30కి పైగా విమానాలు రద్దు.
హైదరాబాద్లో సుమారు 33 విమానాలు రద్దు. బుధవారం కూడా నాలుగు ప్రధాన నగరాల్లో కలిపి దాదాపు 200 సర్వీసులను ఇండిగో నిలిపివేసింది. నవంబర్ నెలలో ఇండిగో ఏకంగా 1,232 విమానాలను రద్దు చేసినట్లు డీజీసీఏ గణాంకాలు వెల్లడించాయి.
ఇండిగోపై ఆధారపడే బడ్జెట్ ప్రయాణికులు ఈ రద్దుల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమైన అపాయింట్మెంట్లు, వ్యాపార సమావేశాలు మరియు కుటుంబ కార్యక్రమాలు ఉన్నవారు విమానాశ్రయాలలోనే ఉండిపోవడంతో, వారి ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకుంది. తమ టికెట్ల డబ్బులు తిరిగి వస్తాయా, ప్రత్యామ్నాయ ప్రయాణం ఎలా అనేది వారికి పెద్ద ప్రశ్నగా మారింది.
విమానాల రద్దుపై ఇండిగో సంస్థ ఆలస్యంగా స్పందించింది. ప్రయాణికులకు క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ అంతరాయానికి కేవలం ఒకే కారణం కాదని, అనేక అంశాలు ప్రభావం చూపాయని ఇండిగో తెలిపింది.. ఊహించని కార్యాచరణ సవాళ్లు. సాంకేతిక లోపాలు. శీతాకాలం షెడ్యూల్ మార్పులు. సిబ్బంది రోస్టరింగ్కు సంబంధించిన కొత్త నిబంధనలు (FDTL).
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రాబోయే 48 గంటల పాటు షెడ్యూళ్లలో సర్దుబాట్లు చేస్తున్నామని, త్వరలోనే సేవలను సాధారణ స్థితికి తీసుకొస్తామని సంస్థ పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో, విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) వెంటనే రంగంలోకి దిగింది.
విమానాల రద్దుకు గల కారణాలపై పూర్తి నివేదిక సమర్పించాలని మరియు ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఇండిగోను డీజీసీఏ ఆదేశించింది. ఈ అంశంపై చర్చించేందుకు గురువారం ఇండిగో అధికారులను సమావేశానికి కూడా పిలిచింది.
డీజీసీఏ నివేదికల ప్రకారం, ఈ సంక్షోభానికి ప్రధాన కారణం కొత్త FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్) నిబంధనలే. కొత్త FDTL నిబంధనలు నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. వీటి ప్రకారం. పైలట్లకు వారానికి 48 గంటల విశ్రాంతి తప్పనిసరి. రాత్రిపూట ల్యాండింగ్లను రెండుకు పరిమితం చేయాలి.
ఈ నిబంధనల వల్ల సిబ్బంది (ముఖ్యంగా పైలట్లు) అందుబాటులో లేకపోవడంతో, నవంబర్ రద్దు అయిన 1,232 విమానాల్లో 755 విమానాలు కేవలం సిబ్బంది కొరత వల్లే రద్దయ్యాయి. ఈ సమస్య కారణంగా అక్టోబర్లో 84.1%గా ఉన్న ఇండిగో ఆన్-టైమ్ పనితీరు (OTP) నవంబర్కు 67.7%కి పడిపోయింది. ఇండిగో ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమించగలుగుతుందో వేచి చూడాలి.