రెస్టారెంట్లు, బార్లపై విధించే రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఆర్ఈటీ) విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. అధికారిక జనాభా లెక్కలను పక్కనపెట్టి, అంచనా వేసిన జనాభా ఆధారంగా ఆర్ఈటీ విధించడం చట్టవిరుద్ధమని స్పష్టంగా పేర్కొంది. ఏపీ ఎక్సైజ్ రూల్స్–2025లోని రూల్ 3(టి) ప్రకారం ‘జనాభా’ అంటే అధికారికంగా ప్రభుత్వం ప్రకటించిన జనగణన లెక్కలేనని న్యాయస్థానం గుర్తుచేసింది. 2011 తర్వాత ఇప్పటి వరకు అధికారిక జనగణన జరగలేదని, అందువల్ల 2011 జనాభా లెక్కలే చట్టబద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసులో మైదుకూరు మున్సిపాలిటీకి సంబంధించిన జనాభా అంశాన్ని హైకోర్టు విపులంగా పరిశీలించింది. 2011 జనగణన ప్రకారం మైదుకూరు మున్సిపాలిటీ జనాభా 45,790 మాత్రమేనని కోర్టు పేర్కొంది. 50 వేల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో రెస్టారెంట్ అండ్ బార్లపై విధించాల్సిన ఆర్ఈటీ రూ.35 లక్షలకే పరిమితమని స్పష్టం చేసింది. అయితే మైదుకూరు మున్సిపల్ కమిషనర్ 2011 తర్వాత జనాభా ప్రతి సంవత్సరం 1.9 శాతం పెరిగిందని అంచనా వేసి, ప్రస్తుతం జనాభా 56,310కు చేరిందని పేర్కొనడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ అంచనాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వ్యాఖ్యానించింది.
కమిషనర్ అంచనా జనాభాను ఆధారంగా తీసుకుని, మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఓ బార్పై రూ.55 లక్షల ఆర్ఈటీ విధిస్తూ కడప జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సంబంధిత బార్ యజమాని హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై తుది విచారణ నిర్వహించిన హైకోర్టు, అంచనా జనాభా ఆధారంగా విధించిన ఆర్ఈటీ పూర్తిగా చట్టవిరుద్ధమని తేల్చింది. దీంతో రూ.55 లక్షల ఆర్ఈటీ విధింపు ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది.
తీర్పులో భాగంగా ఎక్సైజ్ అధికారులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ అభ్యర్థనను తీర్పు అందిన తేదీ నుంచి ఆరు వారాల్లోపు తిరిగి పరిశీలించాలని సూచించింది. నిర్ణీత గడువులోపు పునఃపరిశీలన చేయకపోతే, మైదుకూరు మున్సిపాలిటీ జనాభా 50 వేల లోపే ఉన్నట్లు పరిగణించి రూ.35 లక్షల ఆర్ఈటీ మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. ఈ కీలక తీర్పును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ఇటీవల వెలువరించారు. ఈ తీర్పుతో రాష్ట్రవ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లపై అంచనా జనాభా పేరిట విధిస్తున్న అధిక పన్నులపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.