అమెరికా హెచ్–1బీ, హెచ్–4 వీసాలకు దరఖాస్తు చేసుకునే విదేశీయులపై అమెరికా ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు చేపట్టింది. ప్రామాణిక వీసా స్క్రీనింగ్ ప్రక్రియలో భాగంగా, ఇకపై అన్ని హెచ్–1బీ, హెచ్–4 వీసా దరఖాస్తుదారుల ఆన్లైన్ ప్రెజెన్స్ (సోషల్ మీడియా అకౌంట్లు) ను తప్పనిసరిగా పరిశీలించనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త వెట్టింగ్ విధానం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. వీసా దరఖాస్తుదారుల డిజిటల్ ప్రవర్తనను కూడా జాతీయ భద్రత కోణంలో పరిశీలించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ నెల 15 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయని అమెరికా ఎంబసీ వెల్లడించింది. దీనివల్ల హెచ్–1బీ, హెచ్–4 వీసాల ప్రాసెసింగ్కు మరింత సమయం పట్టే అవకాశముందని పేర్కొంది. అందుకే దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా అప్లికేషన్లు సమర్పించాలని సూచించింది. అయితే ఈ ప్రకటన వెలువడిన సమయానికే భారత్లో ఈ నెలాఖరులో జరగాల్సిన వేలాది హెచ్–1బీ వీసా ఇంటర్వ్యూలను అకస్మాత్తుగా వాయిదా వేయడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఇప్పటికే షెడ్యూల్ చేసిన అపాయింట్మెంట్లు పలు నెలల పాటు వాయిదా పడటం ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచింది.
హెచ్–1బీ వీసా కార్యక్రమంలో భారతీయ నిపుణులు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, వైద్యులు అత్యధికంగా ఉన్నారు. అమెరికా టెక్నాలజీ కంపెనీలకు భారతీయ ప్రతిభ కీలకమైనప్పటికీ, ఈ ప్రోగ్రామ్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే ఈ కఠిన చర్యల వెనుక ఉద్దేశమని అమెరికా అధికారులు స్పష్టం చేస్తున్నారు. అత్యుత్తమ విదేశీ ప్రతిభను ఆహ్వానిస్తూనే, అక్రమాలు, తప్పుడు వివరాలు, భద్రతా ప్రమాదాలు జరగకుండా చూసేందుకే ఈ సోషల్ మీడియా వెట్టింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని ఎంబసీ వివరించింది.
కొత్త వెట్టింగ్ విధానం అమలుతో ఇప్పటికే అనేక మంది వీసా అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 15న ఇంటర్వ్యూలు ఉన్నవారికి మార్చిలో కొత్త తేదీలు కేటాయించగా, 19న అపాయింట్మెంట్ ఉన్నవారిని మే చివరి వరకు వాయిదా వేశారు. దీంతో వీసా కోసం భారత్కు వచ్చిన పలువురు ఉద్యోగులు అమెరికాకు తిరిగి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో, అమెరికా వీసా అనేది హక్కు కాదని, అది ఒక ప్రత్యేక హోదా (ప్రివిలేజ్) మాత్రమేనని ఎంబసీ మరోసారి స్పష్టం చేసింది. వీసా మంజూరైన తర్వాత కూడా స్క్రీనింగ్ కొనసాగుతుందని, చట్ట ఉల్లంఘనలు జరిగితే వీసా రద్దు చేస్తామని హెచ్చరించింది.