“జై బాబు.. జై లోకేష్” నినాదాలతో మార్మోగిన సింగపూర్ విమానాశ్రయం..
ఏపీకి రాయల్ ఎన్ ఫీల్డ్ రాకపై లోకేష్కు ప్రవాసాంధ్రుల ప్రశంసలు..
సింగపూర్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు అక్కడి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. సింగపూర్ విమానాశ్రయం వద్ద తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆత్మీయంగా స్వాగతం తెలిపారు. “జై బాబు.. జై లోకేష్” నినాదాలతో విమానాశ్రయం పరిసరాలు మార్మోగిపోయాయి. అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రవాస భారతీయులు మంత్రి లోకేష్ను కలుసుకుని హర్షం వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రాయల్ ఎన్ ఫీల్డ్ అంశం. ఆంధ్రప్రదేశ్కు ఈ ప్రముఖ సంస్థను తీసుకురావడంలో మంత్రి లోకేష్ తీసుకున్న చొరవపై ప్రవాసాంధ్రులు ప్రశంసలు కురిపించారు. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడంలో ఆయన చూపుతున్న చురుకుదనాన్ని అభినందించారు. “ఏపీ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయం” అంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారు ఆంధ్రప్రదేశ్కు నిజమైన బ్రాండ్ అంబాసిడర్లు అని పేర్కొన్నారు. “మీరు కేవలం ఉద్యోగులు కాదు.. ప్రపంచానికి ఏపీ ప్రతినిధులు. మీరు పనిచేస్తున్న కంపెనీల్లో మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులు, అవకాశాల గురించి గర్వంగా చెప్పండి” అని పిలుపునిచ్చారు.
రాష్ట్రానికి మరిన్ని ఐటీ కంపెనీలు, పరిశ్రమలు వచ్చేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. విదేశాల్లో ఉన్న తెలుగు యువత తమ అనుభవం, పరిజ్ఞానంతో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.
సింగపూర్ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా విద్య, ఐటీ, సాంకేతిక రంగాల్లో కొత్త అవకాశాలను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.
మంత్రి లోకేష్ రాకతో సింగపూర్లోని తెలుగు వారిలో కొత్త ఉత్సాహం కనిపించింది. రాష్ట్రానికి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే దిశగా ఈ పర్యటన కీలకంగా మారనుందని ప్రవాసాంధ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.