అమిత్ షా, సీఆర్ పాటిల్తో చంద్రబాబు సమావేశాలు.. రాష్ట్ర అంశాలపై చర్చ..
నీతి ఆయోగ్, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో చంద్రబాబు చర్చలు..
దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం బిజీబిజీగా గడపనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, కేంద్ర సహాయ నిధులు, మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించేందుకు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన కీలక కార్యక్రమాల్లో కూడా సీఎం పాల్గొననున్నారు.
ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల వరకు పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం ఉదయం 11.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సీఎం భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పరిపాలనా, భద్రతా అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో చంద్రబాబు సమావేశం కానున్నారు. పోలవరం సహా నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రణాళికలపై చర్చ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సీఎంను కలవనుండగా, అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది.
సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో జరిగే సీఐఐ వార్షిక సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలపై సీఎం తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉంది.
సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని ఆర్థిక సలహాదారు ఎస్ మహేంద్రదేవ్ తో సీఎం భేటీ కానున్నారు. అలాగే నీతి ఆయోగ్ సభ్యులు కేవీ రాజు, బాలసుబ్రమణ్యం లతో కూడా సమావేశం జరగనుంది. రాష్ట్ర ఆర్థిక, అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
రోజు చివరగా సాయంత్రం 6.30 గంటలకు రోడ్లు, రహదారుల శాఖ కార్యదర్శి ఉమాన్కర్ తో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు, జాతీయ రహదారుల అభివృద్ధి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం సాధించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఈ ఢిల్లీ పర్యటనను కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.