నాడు పీకలు కోసి.. నేడు నీతులు మాట్లాడటమా..
రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు కట్టేశామని ప్రగల్భాలు..
అమరావతి: వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఇబ్బందులకు గురిచేసి, ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి కొల్లు రరవీంద్ర తీవ్ర స్థాయిలో విమర్శించారు. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పునాది వేసింది మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు. తరువాత ఉమ్మడి రాష్ట్రంలో అనేక మెడికల్ కాలేజీలు, వైద్య సంస్థలను అభివృద్ధి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు దేనని పేర్కొన్నారు. తిరుపతిలో బర్డ్, టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారని తెలిపారు.
అలాగే రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటు చేసి పేదలకు నాణ్యమైన వైద్యం అందించేలా చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశంసించిన మంత్రి, గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆ సంస్థకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎయిమ్స్కు కృష్ణా నది నుంచి పైప్లైన్ ద్వారా నీటి సరఫరా ప్రారంభించిందన్నారు.
మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నామని, దీని ద్వారా రెండు సంవత్సరాల్లో 2500 కొత్త ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. పీపీపీ ఆసుపత్రుల్లో 70 శాతం పడకలను ఎన్టీఆర్ వైద్య సేవ, ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులకు కేటాయిస్తామని వెల్లడించారు.
విద్యారంగంపై మాట్లాడుతూ, 2014-19 మధ్య రాష్ట్రం విద్యా ప్రమాణాల్లో మూడో స్థానంలో ఉండగా, వైసీపీ పాలనలో 19వ స్థానానికి పడిపోయిందని ఆరోపించారు. గత ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు.
పదో తరగతి ఉత్తీర్ణత శాతం వైసీపీ హయాంలో 62 శాతానికి పడిపోయిందని, ఇప్పుడు అది 85 శాతానికి పెరిగిందని మంత్రి చెప్పారు. మెగా పేరెంట్-టీచర్ సమావేశాల ద్వారా గిన్నిస్ రికార్డు సాధించామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ల విలీనంతో విద్యార్థులు చదువుకు దూరమయ్యారని ఆరోపించారు. ఆస్తుల తాకట్టు అంశంపై కూడా మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి భూములు, విశాఖలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి వేల కోట్ల అప్పులు తెచ్చుకున్నారని ఆరోపించారు. గంగవరం పోర్టు, కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టుల అంశాలను కూడా ప్రస్తావించారు.
వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయని, ప్రశ్నించిన వారిపై కేసులు, దాడులు జరిగాయని మంత్రి పేర్కొన్నారు. మద్యం, ఇసుక, రాజధాని అంశాలపై నిరసన తెలిపిన వారిని అణచివేశారని ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నదన్నారు. చివరగా, “ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన మంచి ఒక్కటి అయినా చెప్పగలరా?” అంటూ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని, ఇప్పుడు వైసీపీ నేతలు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా మారిందని వ్యాఖ్యానించారు.