రూ.1000 కోట్ల పెట్టుబడి.. వేలాది ఉద్యోగాలు..
ఆధునిక సాంకేతికతతో స్మార్ట్ తయారీ యూనిట్..
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ప్రవాహం మరింత వేగం పడుతోంది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడటంతో దేశ, విదేశాల ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ కారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఏపీలో భారీ పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.
ఈ నూతన ప్రాజెక్టుకు రేపు శ్రీసిటీలో శంకుస్థాపన జరగనుంది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెట్టుబడుల స్వర్ణయుగం నడుస్తోందని అధికారులు చెబుతున్నారు. గత 22 నెలల్లోనే సుమారు 800 ప్రాజెక్టులు రాష్ట్రానికి రావడం పరిశ్రమల పెరుగుదలకు నిదర్శనంగా నిలిచింది.
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో 39 ఎకరాల విస్తీర్ణంలో క్యారియర్ సంస్థ తన కొత్త తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు మూడు దశల్లో 2028 నాటికి పూర్తికానుండగా, దాదాపు రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా సుమారు 3వేల మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.
దేశంలో పెరుగుతున్న HVAC (హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్) ఉత్పత్తుల డిమాండ్ను తీర్చేందుకు ఈ ప్లాంట్ కీలకంగా మారనుంది. అత్యాధునిక మౌలిక వసతులు, ఆధునిక యంత్రాలు (P&M)తో ఈ యూనిట్ నిర్మించబడుతుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక సమన్వయం, ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
దేశంలో ఇప్పటికే ఐదు దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్యారియర్ సంస్థకు హర్యానాలోని గుర్గ్రామ్లో తయారీ యూనిట్, హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయడం రాష్ట్రానికి మరింత గౌరవం తెస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల రంగంలో మరో పెద్ద అడుగు ముందుకేసింది. పెట్టుబడులు, ఉద్యోగాలు, సాంకేతిక అభివృద్ధి—అన్నీ కలిసి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి.