యూఏఈపై దాడుల్లో ముగ్గురు భారతీయులు గాయపడ్డారు..
పౌరులు, మౌలిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదు..
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు గాయపడినట్లు సమాచారం రావడంతో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, పౌరులు మరియు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు ప్రాంతీయ శాంతి, భద్రతకు భంగం కలిగిస్తాయని పేర్కొన్నారు.
యూఏఈకి భారత్ పూర్తి సంఘీభావం తెలుపుతుందని, ఈ క్లిష్ట సమయంలో ఆ దేశంతో కలిసి నిలుస్తామని తెలిపారు. సమస్యలను యుద్ధంతో కాకుండా చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే హర్మూజ్ జలసంధి మీదుగా సురక్షిత నౌకాయానం కొనసాగడం అత్యంత కీలకమని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ ఇంధన సరఫరాలకు ఇది ప్రధాన మార్గం కావడంతో, అక్కడ స్థిరత్వం ఉండటం చాలా అవసరమని చెప్పారు.
ప్రాంతీయ శాంతి, స్థిరత్వం మాత్రమే కాకుండా ప్రపంచ ఇంధన భద్రత కూడా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రధాని మోదీ తన సందేశంలో తెలిపారు.