ప్రతి జిల్లాలో కనీసం ఒక మెగా ఇండస్ట్రియల్ పార్క్..
ప్రతి ఇండస్ట్రియల్ క్లస్టర్ సమీపంలో ఇండస్ట్రియల్ టౌన్షిప్లు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే ఉత్పత్తులు ప్రపంచస్థాయి బ్రాండ్లుగా ఎదగాలంటే నాణ్యతపై ప్రత్యేక దృష్టి అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైలు, పోర్ట్ కనెక్టివిటీని సమర్థంగా కల్పించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్న ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్ల పురోగతిని సీఎం సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ ‘భారత్ ఆడ్యోగిక వికాస్ యోజన (BHAVYA)’ కింద అభివృద్ధి చేయనున్న ఇండస్ట్రియల్ పార్కులు, కెమికల్ పార్కులపై చర్చ జరిగింది.
2026–27 నాటికి రేర్ ఎర్త్ మినరల్ పార్క్ ఏర్పాటు, ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి, కంటైనర్ తయారీ క్లస్టర్ ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 175 ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి వంటి అంశాలు కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి.
పారిశ్రామిక పార్కుల్లో లాజిస్టిక్స్తో పాటు నీరు, విద్యుత్, కోల్డ్ స్టోరేజ్, గోదాములు వంటి మౌలిక సదుపాయాలు సమగ్రంగా ఉండాలని సీఎం సూచించారు. స్థానిక ఉత్పత్తులు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ పడాలంటే నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ యూనిట్లు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేలా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు కూడా పారిశ్రామిక అభివృద్ధి ప్రయోజనాలు చేరాలనే ఉద్దేశంతో క్లస్టర్లలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (FPOs) ఏర్పాటు చేయాలని సూచించారు. భవ్య పథకం కింద అనుకూల ప్రాంతాల్లో కెమికల్ తయారీ పార్కులను అభివృద్ధి చేయాలని చెప్పారు.
పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాలను సమన్వయంతో అభివృద్ధి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి స్థానిక యువతకు భారీ ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రతి ఇండస్ట్రియల్ క్లస్టర్ సమీపంలో ఇండస్ట్రియల్ టౌన్షిప్లు అభివృద్ధి చేయాలని సూచించిన సీఎం, “ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త” (One Family One Entrepreneur) ఆలోచనను ప్రోత్సహించాలని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని, విశ్వవిద్యాలయాల్లో హైబ్రిడ్ విధానంలో కోర్సులు ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమల మంత్రి టీజీ భరత్, ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.