భారీ భవనాలు.. ఆధునిక నిర్మాణాలు.. భూగర్భ సదుపాయాలకు ప్రాధాన్యత..
సంస్థలు, విద్యా కేంద్రాలకు భూముల కేటాయింపు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి అభివృద్ధిని వేగవంతం చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం ₹6,500 కోట్లకు పైగా వ్యయంతో ప్రధాన మౌలిక వసతుల నిర్మాణానికి తొమ్మిది ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓలు) జారీ చేసింది. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
ఈ ప్రాజెక్టుల్లో ముఖ్యంగా ప్రభుత్వ విభాగాల కోసం ఆధునిక టవర్స్, శాసనసభ భవనం, అలాగే కృష్ణా నది వరదల నివారణకు బలమైన వ్యవస్థల నిర్మాణం ఉన్నాయి. పర్యావరణానికి అనుకూలంగా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్లను అనుసరించి, విద్యుత్, నీటి సరఫరా వంటి సౌకర్యాలను భూగర్భంలో ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది.
రాజధాని నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచే భారీ నిర్మాణాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. సెక్రటేరియట్, హెచ్ఓడీ టవర్స్ నిర్మాణానికి ₹2,540 కోట్లు, శాసనసభ భవనానికి ₹798 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఇందులో పార్కింగ్, స్పైర్, వంతెనలు వంటి సదుపాయాలు ఉంటాయి. ‘క్వాంటమ్ వ్యాలీ’లో భాగంగా రెండు ట్విన్ టవర్స్ నిర్మాణానికి ₹1,208 కోట్లు కేటాయించారు. భవిష్యత్తులో మొత్తం ఎనిమిది టవర్స్ నిర్మించే ప్రణాళిక ఉంది.
అమరావతిని ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు భూగర్భ సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 220 కేవీ భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, వర్షపు నీటి డ్రైనేజ్, ఐసీటీ డక్టులు—అన్నీ ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రౌండ్ గా ఉంటాయి. ఉండవల్లి ట్రంక్ సిస్టమ్ కింద రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, ఎస్టీపీలు ఏర్పాటు చేయనున్నారు.
కృష్ణా నది వరదల నుంచి రాజధానిని రక్షించేందుకు ₹443 కోట్లు కేటాయించారు. రిటైనింగ్ వాల్స్ స్థానంలో బలమైన ఎంబాంక్మెంట్లు నిర్మించనున్నారు. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సహకారం కూడా అందుతోంది. అదనంగా మురుగునీటి శుద్ధి, రీయూజ్ నీటి లైన్లపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.
అమరావతిలో ఆర్థిక, విద్యా, సేవా రంగాల అభివృద్ధికి ప్రభుత్వం భూములు కేటాయించింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజి బోర్డు ఆఫ్ ఇండియా (SEBI)కు 1.78 ఎకరాలు కేటాయించారు. స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్కు 4.22 ఎకరాలు, డీఏవి స్కూల్కు 3 ఎకరాలు ఇచ్చారు. మెర్క్యూర్ హోటల్ నిర్మాణానికి 1 ఎకరం కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ఫైర్ సర్వీసెస్ వంటి సంస్థలకు కూడా స్థలాలు ఇచ్చారు.
రైతులకు భరోసా
భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. వార్షిక లీజు చెల్లింపులను పెంచి, ఎకరానికి ఎండభూమికి ₹40,000, నీటి భూమికి ₹60,000గా నిర్ణయించింది. అలాగే రుణభారం తగ్గించే చర్యలు కూడా తీసుకుంది. త్వరిత నిర్ణయాలతో అమరావతిని వచ్చే ఏడాదిలోనే పూర్తిస్థాయి కార్యకలాపాలు జరిగే రాజధానిగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆధునిక సదుపాయాలు, పర్యావరణ హిత విధానాలు, సంస్థల స్థాపన—ఇలా అన్నీ కలిపి అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం దూసుకెళ్తోంది.