అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఈ మధ్య పర్యాటకులతో కిటకిటలాడుతోంది. చల్లని వాతావరణం, ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తుండటంతో జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలకు సందర్శకుల తాకిడి భారీగా పెరిగింది. వీకెండ్తో పాటు వరుసగా సెలవులు రావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో అరకు లోయ వైపు క్యూ కట్టారు. ఫలితంగా అరకు ప్రాంతం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించింది.
ప్రత్యేకంగా అరకు లోయలోని హోటళ్లు, రిసార్ట్స్ అన్నీ హౌస్ఫుల్గా మారాయి. ముందస్తు బుకింగ్ లేకుండా వచ్చిన పర్యాటకులు గదులు దొరకక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాడగడ, వంజంగి మేఘాల కొండ వ్యూ పాయింట్లు ఈసారి పర్యాటకులతో నిండిపోయాయి. తెల్లవారుజామున మేఘాల మధ్య సూర్యోదయం వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ వంటి పలు రాష్ట్రాల నుంచి పర్యాటకులు పోటెత్తారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన మేఘాల దృశ్యాలు ఈ రద్దీకి ప్రధాన కారణంగా మారాయి.
ఇక సుంకరిమెట్ట వుడెన్ బ్రిడ్జ్ వద్ద కూడా సందర్శకుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. బ్రిడ్జ్పై ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు పర్యాటకులు భారీగా తరలిరావడంతో పరిసర ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. ఈ క్రమంలో శనివారం అరకు–పాడేరు ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు కదలక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం కూడా పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శని, ఆదివారాలు వరుసగా సెలవులు రావడంతో చాలామంది అరకు టూర్ను ముందుగానే ప్లాన్ చేసుకున్నారు.
మరోవైపు, భారీ రద్దీతో పాటు భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సుంకరిమెట్ట వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళల్లో మార్పులు చేశారు. ఇకపై ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే సందర్శకులకు అనుమతి ఉంటుందని ప్రకటించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వుడెన్ బ్రిడ్జ్కు ఎలాంటి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పర్యాటకులు అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.