- మాల్దీవులు వెళ్లే భారతీయులకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో హెచ్చరిక..
- Travel: తెలియని వ్యక్తులు ఇచ్చే ప్యాకెట్లు, లగేజీలు తీసుకెళ్లవద్దని సూచన..
Maldives: మాల్దీవుల పర్యటనకు వెళ్లే భారతీయ పౌరులకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అత్యంత కీలకమైన హెచ్చరికను జారీ చేసింది. ఆ దేశంలో మాదకద్రవ్యాల నిరోధక చట్టాలను అత్యంత కఠినతరం చేసిన నేపథ్యంలో, పర్యాటకులు ఏమరపాటుగా ఉంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. వేసవి సెలవుల సీజన్ కావడంతో భారత్ నుండి మాల్దీవులకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్న తరుణంలో, ఎన్సీబీ ఈ సూచనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మాల్దీవుల ప్రభుత్వం ఇటీవల తన డ్రగ్స్ నిరోధక చట్టాలకు చేసిన సవరణలు 2026 మార్చి నుండి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయని, వీటి ప్రకారం డ్రగ్స్ కేసుల్లో పట్టుబడితే ఎటువంటి మినహాయింపులు ఉండవని భారత అధికారులు హెచ్చరిస్తున్నారు.
నూతన చట్టాల ప్రకారం మాల్దీవుల్లో మాదకద్రవ్యాల నేరాలకు సంబంధించి కఠినతరమైన శిక్షలు అమలు చేయనున్నారు. నేరం యొక్క తీవ్రతను బట్టి జీవిత ఖైదు నుండి, భారీ స్థాయిలో డ్రగ్స్ రవాణా చేసే వారికి కోర్టు అనుమతితో మరణశిక్ష వరకు విధించే అవకాశం ఉందని ఎన్సీబీ వివరించింది. అతి తక్కువ పరిమాణంలో డ్రగ్స్ కలిగి ఉన్నా లేదా రవాణా చేసినా కఠిన శిక్షలు తప్పవని పేర్కొంది. ఇటీవల కాలంలో పలువురు విదేశీయులు, ముఖ్యంగా కొంతమంది భారత పౌరులు కూడా అక్కడ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడి జైలు పాలైన ఘటనలను ఎన్సీబీ గుర్తుచేసింది. ఈ క్రమంలోనే మాలేలోని భారత హైకమిషన్ కూడా స్థానిక చట్టాల పట్ల గౌరవంతో ఉంటూ, నిబంధనలను అతిక్రమించవద్దని ఇప్పటికే పర్యాటకులకు సూచనలు జారీ చేసింది.
ప్రయాణికులు తమ లగేజీ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, విమానాశ్రయాలు లేదా పోర్టులలో గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే ప్యాకెట్లు, వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్లవద్దు. ఇతరుల వస్తువులను తమ లగేజీలో ఉంచుకోవడం వల్ల తెలియకుండానే నేరాల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని, ఆ సమయంలో 'చట్టం తెలియదు' అనే వాదన చెల్లదని ఎన్సీబీ స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా అనుమానాస్పదంగా వస్తువులను అప్పగించే ప్రయత్నం చేస్తే లేదా డ్రగ్స్ రవాణాకు ప్రోత్సహిస్తే తక్షణమే జాతీయ నార్కోటిక్స్ హెల్ప్లైన్ నంబర్ '1933'కు సమాచారం ఇవ్వాలని కోరింది. మాల్దీవుల అందాలను ఆస్వాదించేందుకు వెళ్లే పర్యాటకులు ఈ నిబంధనలను పాటిస్తూ క్షేమంగా తిరిగి రావాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.