కుటుంబ బాధ్యతలు మోస్తున్న వితంతువులకు అండగా ప్రభుత్వం..
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు..
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిర్వహించిన ప్రజాదర్బార్కు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను వినిపించారు. నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ముఖ్యంగా వితంతువుల సమస్యలపై మంత్రి ప్రత్యేకంగా స్పందించారు. ఇంటి పెద్దను కోల్పోయి కుటుంబ బాధ్యతలను మోస్తున్న మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అలాంటి వితంతువులకు ప్రభుత్వం తీపికబురు చెప్పిందని, కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు వేగవంతం చేశామని వెల్లడించారు.
జూన్ 12న అర్హులైన వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. పింఛన్ల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా త్వరలోనే ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుందని తెలిపారు.
ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే స్పందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని చెప్పారు. ప్రజలకు నేరుగా సేవలు అందించే విధంగా పరిపాలనను మరింత ప్రజలకు చేరువ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.