కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకూ కరెంట్ ఛార్జీల పెంపు లేదు..
యూనిట్కు రూపాయి తగ్గించాలని సీఎం చంద్రబాబు ఆదేశం..
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ రంగంలో ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వచ్చే ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలను తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రతి యూనిట్పై కనీసం రూపాయి మేర ఛార్జీలు తగ్గించాలని సీఎం స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారని వెల్లడించారు.
దేశంలోని చాలా రాష్ట్రాల్లో “ట్రూఅప్” పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచుతున్న పరిస్థితి ఉందని, అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రజలపై భారం మోపకుండా “ట్రూడౌన్” విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు అమలు చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు కృషి వల్లే ఆంధ్రప్రదేశ్కు 20 లక్షల “సూర్యఘర్” కనెక్షన్లు మంజూరయ్యాయని చెప్పారు. దీని ద్వారా సాధారణ కుటుంబాలు విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకోవడంతో పాటు స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న లో ఓల్టేజ్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అవసరానికి అనుగుణంగా కొత్త సబ్స్టేషన్లు నిర్మించి విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తామని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
విద్యుత్ రంగంలో సంస్కరణలు, పునరుత్పాదక శక్తికి ప్రోత్సాహం, ప్రజలపై అదనపు భారం లేకుండా సేవలు అందించడం ద్వారా రాష్ట్రాన్ని శక్తి పరంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.