భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిపై తిరుపతిలో ఫ్లెక్సీలు..
ఆరు కిలోల గంజాయితో పట్టుబడిన వైసీపీ నేత భాను..
తిరుపతి నగరంలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని నగరంలోని ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల ఆరు కిలోల గంజాయితో పట్టుబడిన వైసీపీ నేత భాను వ్యవహారం నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం మరింత ఆసక్తికరంగా మారింది. భాను, భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డితో కలిసి ఉన్న ఫోటోలను ఫ్లెక్సీల్లో ముద్రించి వివిధ ఆరోపణలు చేశారు.
“ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి వనంగా మార్చవద్దు”, “పుణ్యక్షేత్రం తిరుపతిని గంజాయి నుంచి కాపాడుకుందాం” వంటి నినాదాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తిరుపతి వంటి పవిత్రక్షేత్రంలో గంజాయి మాఫియా పెరుగుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే వైసీపీ పాలనలో భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి కలిసి రూ.50 కోట్ల అక్రమ సంపాదన చేశారంటూ ఫ్లెక్సీల్లో ఆరోపణలు చేశారు. గంజాయి విక్రయాల వెనుక అభినయ్ రెడ్డి పాత్ర ఉందంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు కనిపించాయి.
“తిరుపతిని కాపాడుకుందాం – భూమన కుటుంబాన్ని తరిమికొడదాం” అనే నినాదాలు కూడా ఫ్లెక్సీల్లో ప్రధానంగా కనిపించాయి. దీంతో నగరంలో రాజకీయ చర్చలు మరింత ముదిరాయి.
ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారన్న విషయం మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే నగరంలోని రద్దీ కూడళ్లలో ఒక్కసారిగా భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు కనిపించడంతో ప్రజలు ఆసక్తిగా చర్చించుకున్నారు.
మరోవైపు ఈ వ్యవహారం రాజకీయంగా మరింత దుమారం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి వంటి ఆధ్యాత్మిక నగరంలో గంజాయి వ్యవహారం మళ్లీ చర్చకు రావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.