పెట్రోల్, డీజిల్ ధరలపై వివరణ.. వైసీపీపై తీవ్ర విమర్శలు..
ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల మద్దతుతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ అన్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత రెండేళ్లుగా ప్రభుత్వం పారదర్శక పాలనతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని, ప్రజలు నిర్మాణాత్మకంగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. అయితే ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా విజయవాడకు చెందిన వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాల కారణంగా ఇంధన ధరలు పెరిగాయని రాకేష్ వివరించారు. ఈ ప్రభావం ఒక్క ఆంధ్రప్రదేశ్పైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉందన్నారు. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి దేశాల్లో కూడా పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్రోల్పై రూ.41, డీజిల్పై రూ.31 వరకు అదనపు భారం మోపారని ఆరోపించారు. వ్యాట్, రోడ్ సెస్ పేర్లతో ప్రజలపై భారాలు వేసి పెట్రోల్ ధరను రూ.107కు, డీజిల్ ధరను రూ.99కు చేర్చారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్ర వాటాగా ఒక్క రూపాయి కూడా పెంచలేదని, కేంద్ర నిర్ణయం వల్ల మాత్రమే స్వల్పంగా రూ.3 వరకు మార్పు వచ్చిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలపై అదనపు భారం వేయకుండా ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరిస్తోందని చెప్పారు.
పెట్రోల్ ధరల అంశంపై మంత్రి నారా లోకేష్ పై కేసులు పెట్టాలని మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల వచ్చిన ఇంధన సంక్షోభానికి లోకేష్కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు.
నారా లోకేష్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్కు తీసుకొస్తూ రాష్ట్ర జీడీపీని పెంచుతున్నారని రాకేష్ కొనియాడారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ నియామకాలు సహా పలు ఖాళీల భర్తీ జరుగుతోందన్నారు.
అలాగే “తల్లికి వందనం” పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం “అమ్మఒడి” పేరుతో హామీలు ఇచ్చి చివరకు ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
వైసీపీ నేతలు ప్రజల్లో తమకు మద్దతు లేకపోవడంతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని రాకేష్ విమర్శించారు. గతంలో తమపై పెట్టిన కేసుల సంఖ్యంత మంది కూడా ఇప్పుడు వైసీపీ నేతల వెనుక లేరని ఎద్దేవా చేశారు.
వెల్లంపల్లి శ్రీనివాస్పై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూ వివాదాలు, ఆస్తి తగాదాల్లో జోక్యం చేసుకుని డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపణలు చేశారు. త్వరలోనే ఆయనపై ఉన్న ఫిర్యాదులు, బాధితుల వివరాలు బయటపెడతామని హెచ్చరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజల వైపు నుంచి పెద్దగా సమస్యలు లేవని, అందుకే వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని రాకేష్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. మరోసారి తమ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.