2047 నాటికి “డ్రగ్ ఫ్రీ ఇండియా” సాధించడమే దేశ జాతీయ లక్ష్యం..
మాదకద్రవ్యాలపై “జీరో టాలరెన్స్” విధానం కఠినంగా అమలు..
దేశ భవిష్యత్తును కాపాడాలంటే మాదకద్రవ్యాల నిర్మూలన అత్యంత కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి “డ్రగ్ ఫ్రీ ఇండియా” సాధించడమే దేశ జాతీయ లక్ష్యమని తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేవలం చట్టవ్యవస్థ సమస్య మాత్రమే కాకుండా సమాజం, యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదకర అంశమని ఆయన హెచ్చరించారు.
రామేశ్వర నాథ్ కావ్ స్మారకార్థం ప్రతి ఏడాది నిర్వహించే ఆర్.ఎన్.కావో మెమోరియల్ లెక్చర్లో పాల్గొన్న అమిత్ షా, దేశ భద్రతా సంస్థలు డ్రగ్ సిండికేట్లను పూర్తిగా కూల్చివేసేందుకు ప్రత్యేక రోడ్మ్యాప్ సిద్ధం చేశాయని వెల్లడించారు. మాదకద్రవ్యాలపై “జీరో టాలరెన్స్” విధానాన్ని భారత్ కఠినంగా అమలు చేస్తోందని చెప్పారు.
భారత్ భూభాగాన్ని మాదకద్రవ్యాల రవాణా మార్గంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించనివ్వమని అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలోకి ఒక్క గ్రాము డ్రగ్స్ కూడా రానీయకుండా, దేశం నుంచి బయటకు వెళ్లనీయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
డ్రగ్ మాఫియా ద్వారా వచ్చే డబ్బు ఉగ్రవాద, నేర గ్యాంగులకు చేరుతూ సమాంతర ఆర్థిక వ్యవస్థకు దారి తీస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దీర్ఘకాలిక నష్టం చాలా సార్లు కనిపించకపోయినా, అది సమాజాన్ని లోపల నుంచి బలహీనపరుస్తుందని చెప్పారు.
డ్రగ్స్ నిర్మూలనలో ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అమిత్ షా సూచించారు. దేశాల మధ్య చట్టాల్లో ఉన్న తేడాలను డ్రగ్ కార్టెల్స్ తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాయని తెలిపారు. నిషేధిత పదార్థాల నిర్వచనం, శిక్షల విషయంలో అంతర్జాతీయ స్థాయిలో ఒకే విధమైన చట్టాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకోవాలంటే రియల్టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ ఎంతో అవసరమని చెప్పారు. గత రెండేళ్లలో స్నేహపూర్వక దేశాల సహకారంతో 40 మందికిపైగా అంతర్జాతీయ నేరస్థులను భారత్కు తిరిగి తీసుకురాగలిగామని వెల్లడించారు.
డ్రగ్స్పై పోరాటం జాతీయ భద్రత, ప్రజారోగ్యం, యువత భవిష్యత్తుతో నేరుగా సంబంధం ఉన్న అంశమని అమిత్ షా పేర్కొన్నారు. భౌగోళిక, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. యూనీఫార్మ్ లాస్, ఇంటెలిజన్స్ షేరింగ్, ఎక్స్ట్రాడిషన్ అగ్రీమెంట్స్ వంటి అంశాల్లో అంతర్జాతీయ సహకారం మరింత బలపడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.