- Politics: మెజారిటీని అసెంబ్లీలోనే నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు తీర్పును గుర్తుచేసిన కమల్..
- తమిళనాడులో అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్ టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించని గవర్నర్..
Kamal Haasan: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న అనూహ్య రాజకీయ పరిణామాలపై మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత, ఎంపీ కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ఆ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ జాప్యం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది కేవలం రాజకీయ అంశం మాత్రమే కాదని, ప్రజల తీర్పును అగౌరవపరచడమేనని కమల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, ఎన్నికైన సభ్యులు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేకపోవడం రాష్ట్రానికి జరిగిన అవమానమని, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది తీరని నష్టమని తన పోస్ట్లో పేర్కొన్నారు.
రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని ఇలాంటి ఫలితం రావడం ఇదే తొలిసారి అని కమల్ హాసన్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటామని ప్రకటించడాన్ని ఆయన రాజకీయ పరిపక్వతగా అభివర్ణించారు. ఇదే క్రమంలో రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కూడా తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని కమల్ కోరారు. 108 స్థానాలు గెలుచుకున్న పార్టీకి అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఇది తన డిమాండ్ కాదని, కేవలం వ్యవస్థల బాధ్యతను గుర్తు చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యంగా ఎస్.ఆర్. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును కమల్ హాసన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మెజారిటీని రాజ్భవన్లో కాకుండా శాసనసభ వేదికగానే నిరూపించుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఒక భారతీయ పౌరుడిగా విధానపరమైన గళాన్ని వినిపిస్తున్నానని, పార్టీ రాజకీయాలకు అతీతంగా తమిళనాడు ప్రజల తీర్పును గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.