- చిన్న పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ (118) దాటేందుకు విజయ్ వ్యూహం..
- Politics: గవర్నర్ ఆర్వీ అర్లేకర్తో భేటీ అయి, బలనిరూపణకు సిద్ధమని వెల్లడి..
Vijay: తమిళనాడు రాజకీయ యవనికపై ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీపై స్పష్టత కరువవ్వడంతో తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తన వ్యూహాలకు పదును పెట్టారు. గురువారం ఉదయం ఆయన రాజ్భవన్లో గవర్నర్ ఆర్వీ అర్లేకర్తో మరోసారి భేటీ అయ్యారు. సభలో తన బలాన్ని నిరూపించుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం తమ వద్ద ఉందని, వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఈ సందర్భంగా ఆయన గవర్నర్ను కోరినట్లు తెలుస్తోంది. బుధవారం నాటి తొలి భేటీలో మెజారిటీపై గవర్నర్ సందేహాలు వ్యక్తం చేయడంతో ప్రమాణస్వీకారం వాయిదా పడిన నేపథ్యంలో, ఈ రెండో భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్ను చేరుకోవడానికి విజయ్ నేతృత్వంలోని కూటమికి మరో ఐదు స్థానాల అవసరం ఏర్పడింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 సీట్లతో కలిపి టీవీకే కూటమి బలం 113 వద్ద నిలిచింది. ఈ లోటును పూడ్చుకునేందుకు విజయ్ ప్రస్తుతం చిన్న పార్టీల మద్దతును కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా డీఎంకే మిత్రపక్షాలైన వీసీకే (2 సీట్లు), సీపీఐ, సీపీఎం (కలిపి 4 సీట్లు) పార్టీలతో టీవీకే నేతలు ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకవేళ వామపక్షాలు మరియు వీసీకే మద్దతు లభిస్తే కూటమి బలం 119కి చేరుకుంటుంది, ఇది మ్యాజిక్ ఫిగర్ కంటే ఒకటి ఎక్కువ. ఈ కీలక నిర్ణయాన్ని వామపక్షాలు నేడు సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది.
మరోవైపు, ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకేతో పొత్తుకు సంబంధించి వస్తున్న వార్తలకు ఆ పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి తెరదించారు. విజయ్కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన ఖరాకండిగా స్పష్టం చేసినట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ నిర్ణయం కోసం వేచి చూస్తున్న విజయ్, ఒకవేళ రెండోసారి కూడా సానుకూల స్పందన రాకపోతే రాజ్యాంగబద్ధంగా న్యాయ పోరాటానికి సిద్ధమవ్వాలని యోచిస్తున్నారు. వెండితెరపై ఎదురులేని నాయకుడిగా వెలిగిన దళపతి, ఇప్పుడు ప్రజా క్షేత్రంలో ఎదురైన ఈ రాజకీయ సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తారనేది తమిళనాట హాట్ టాపిక్గా మారింది.