న్యూఢిల్లీ: దేశంలో తల్లి మరియు శిశు ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ‘జనని’ (JANANI – Journey of Antenatal, Natal and Neonatal Integrated Care) పేరుతో ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది.
ఈ జనని ప్లాట్ఫామ్ ముఖ్యంగా మహిళల ప్రసూతి కాలం మొత్తం ఆరోగ్య వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసి పర్యవేక్షించడానికి రూపొందించబడింది. మహిళల యుక్త వయస్సు నుండి గర్భధారణ, ప్రసవం, అనంతర సంరక్షణ వరకు అన్ని వివరాలను సమగ్రంగా నమోదు చేసే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.
ఇప్పటివరకు ఈ ప్లాట్ఫామ్లో సుమారు 1 కోటి 34 లక్షల మంది లబ్ధిదారులు నమోదు కావడం విశేషం. దీని ద్వారా తల్లి మరియు శిశు ఆరోగ్య సేవలను సులభంగా ట్రాక్ చేయవచ్చని అధికారులు తెలిపారు. జనని ప్లాట్ఫామ్ ద్వారా గర్భధారణ ముందస్తు పరీక్షలు (అంటీనేటల్ కేర్), ప్రసవ సేవలు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశు సంరక్షణ, ఇంటి వద్ద శిశు సంరక్షణ సేవలు మరియు కుటుంబ నియంత్రణ వంటి సేవలు ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయి.
ఈ కార్యక్రమం వల్ల గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు సమయానికి వైద్య సేవలు అందే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. తల్లి మరియు శిశు ఆరోగ్యం మెరుగుపడటానికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని అభిప్రాయపడుతున్నారు. ‘జనని’ ప్లాట్ఫామ్ ద్వారా దేశంలో ఆరోగ్య సేవలను డిజిటల్ దిశగా తీసుకెళ్లడమే కాకుండా, ప్రతి తల్లి మరియు శిశువుకు మెరుగైన సంరక్షణ అందించే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం సాధించాలని భావిస్తోంది.