3 నెలల్లో 28 జిల్లాల ప్రతినిధులతో సమీక్షలు చేపట్టిన సీఎం చంద్రబాబు..
జిల్లాలవారీగా ప్రజాప్రతినిధులు, ఇన్ ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష..
అమరావతి: రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత మూడు నెలలుగా నిర్వహించిన జిల్లాల వారీ సమీక్షలను పూర్తి చేశారు. ఫిబ్రవరి 12న కృష్ణా జిల్లాతో ప్రారంభమైన ఈ సమీక్షల పరంపర తాజాగా విశాఖపట్నం జిల్లాతో ముగిసింది. మొత్తం 28 జిల్లాల ప్రజాప్రతినిధులు, ఇన్ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం విస్తృతంగా చర్చలు జరిపారు.
ఈ సమీక్షల్లో ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, అభివృద్ధి అవసరాలు, ప్రజల ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం వెయ్యికి పైగా సమస్యలు వివిధ జిల్లాల నుంచి ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. వాటిలో అత్యవసరమైన అంశాలపై అక్కడికక్కడే చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఆర్థిక వ్యయం అవసరం లేని పనులను వెంటనే పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను సమన్వయం చేసి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణ మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ సమీక్షల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై కూడా సీఎం చంద్రబాబు నివేదికలు స్వీకరించినట్లు సమాచారం. ప్రజలతో మమేకమై పనిచేయాలని, పనితీరు సరిగా లేని ప్రజాప్రతినిధులు తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. ప్రజల్లో వివాదాలకు దారి తీసే అంశాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలకు సీఎం స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది.
కూటమి ప్రభుత్వంలో భాగమైన పార్టీల మధ్య సమన్వయం ఎంతో ముఖ్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు సూచించే స్థానిక సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఇక అధికారుల పనితీరుపైనా సీఎం సూక్ష్మస్థాయిలో సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రజలకు వేగంగా సేవలు అందించే విధంగా పాలన ఉండాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం ఉండకూడదని సూచించారు. ఈ జిల్లాల వారీ సమీక్షలు ప్రభుత్వ పనితీరుకు కొత్త దిశానిర్దేశం చేసినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.