ఆంధ్రప్రదేశ్ను 2026 జూన్ నాటికి పూర్తిగా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో జరిగిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. అయితే ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే రాష్ట్రాన్ని శుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దగలమని చెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వం వదిలివెళ్లిన సుమారు 86 లక్షల టన్నుల చెత్తను ఇప్పటికే తొలగించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. చెత్తను సమస్యగా కాకుండా సంపదగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాటికి రాష్ట్రంలోని రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం చూపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదే క్రమంలో ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ రథం కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందని సీఎం పేర్కొన్నారు. స్వచ్ఛ రథాల ద్వారా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తున్నామని, చెత్తకు బదులుగా అవసరమైన సరుకులను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టును మొదట ప్రయోగాత్మకంగా ప్రారంభించగా ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ప్రస్తుతం 26 ప్రాంతాల్లో అమలు చేస్తున్నామని చెప్పారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇళ్లలోని పొడి చెత్తను రోడ్లపై వేయకూడదని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు. పొడి చెత్తకు కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని ప్రకటించారు. రోడ్లు మనవేననే భావనతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇంట్లోనే చెత్తను కంపోస్ట్గా మార్చుకోవాలని, రాబోయే రోజుల్లో పట్టణాల్లో 5 లక్షల ఇళ్లు, గ్రామాల్లో 10 లక్షల ఇళ్లలో కంపోస్ట్ తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం తాళ్లపాలెంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన సీఎం చంద్రబాబు, ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత, పాఠశాల పరిసరాల శుభ్రతను స్వయంగా పరిశీలించారు.