Politics- 97 శాతం పూర్తయిన భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు…
రాష్ట్రవ్యాప్తంగా కనెక్టివిటీ పెంచేలా భారీ ప్లాన్…
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రానున్న ఆరు ఎయిర్పోర్ట్లు ఇవే!
Bhogapuram Airport: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విమానయాన రంగంలో ఒక గొప్ప శుభవార్త అందింది. విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ ఏడాది జూలై లేదా ఆగస్టు నెలల్లో దీనిని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ ఎయిర్పోర్ట్కు సంబంధించిన 97 శాతం పనులు పూర్తయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ప్రస్తుతం భోగాపురం ఎయిర్పోర్ట్లో రన్వే పనులు 100 శాతం పూర్తవ్వగా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) పనులు 95 శాతం పూర్తయ్యాయి. కేవలం ఎయిర్పోర్ట్ను ప్రధాన రహదారులతో అనుసంధానించే రోడ్ల పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఈ నెలాఖరులోగా ఆ పనులను కూడా పూర్తి చేసి, జూలై 5 లేదా 8న, లేదంటే ఆగస్టు 17 లేదా 19వ తేదీల్లో ప్రారంభోత్సవం చేసేందుకు ముహూర్తం ఖరారు చేస్తున్నారు.
కేవలం భోగాపురం మాత్రమే కాకుండా, ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మరో ఆరు కొత్త విమానాశ్రయాలను నిర్మించాలని నిర్ణయించింది. ఉడాన్ 2.0 పథకం కింద నాగార్జున సాగర్ వద్ద ఒక ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు కేంద్రం ఇప్పటికే నిధులు కేటాయించింది. దీనివల్ల పల్నాడు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలకు విమాన సౌకర్యం మెరుగుపడనుంది. రాష్ట్రం నలుమూలలా కనెక్టివిటీని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
కొత్తగా నిర్మించబోయే విమానాశ్రయాల్లో నెల్లూరు జిల్లా దగదర్తి, చిత్తూరు జిల్లా కుప్పం, అమరావతి, శ్రీకాకుళం, కాకినాడ జిల్లా అన్నవరం వంటి ప్రాంతాలు ఉన్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ప్రకాశం జిల్లా ఒంగోలు, అనంతపురం జిల్లాల్లో కూడా కొత్త ఎయిర్పోర్ట్ల కోసం ప్రభుత్వం డీపీఆర్లను (DPR) సిద్ధం చేస్తోంది. వీటివల్ల పారిశ్రామికంగా, పర్యాటక రంగంలో ఏపీ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
ఈ కొత్త విమానాశ్రయాల ఏర్పాటు వల్ల కేవలం ప్రయాణికులకే కాకుండా, సరుకు రవాణాకు (Cargo) కూడా ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్ట్ కీలక పాత్ర పోషించనుంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్పై భారం తగ్గడమే కాకుండా, అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ఇక్కడి నుంచి నేరుగా నడిచే అవకాశం ఉంటుంది.