దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగభరిత లేఖ రాశారు. “అయోధ్యలో భవ్యమైన శ్రీరామ మందిరం నిర్మాణం అనంతరం ఇది రెండో దీపావళి. ఈ సంవత్సరం దీపావళి మరింత ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది సత్యం, ధర్మం, ధైర్యం, మరియు ఆశ యొక్క ఉత్సవం. మనకు ఎల్లప్పుడూ అన్యాయానికి ఎదురు నిలిచి సత్యపథంలో నడిచే స్ఫూర్తి శ్రీరాముడి జీవితం నుంచే లభించింది” అని మోదీ పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ, “శ్రీరాముడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు ఆయన ఒక ఆలోచన, ఒక విలువ. మనలోని ధర్మాన్ని, ధైర్యాన్ని, సేవభావాన్ని మేల్కొలిపే శక్తి. మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల సమయంలో శ్రీరాముడి మార్గదర్శకత్వం మనకు ప్రేరణగా నిలుస్తోంది” అన్నారు.

ఈ సందర్భంలో ఆయన ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. “కొన్ని నెలల క్రితం మన సైన్యం, భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మన దేశ ధైర్యానికి నిదర్శనం. శ్రీరాముడు చెడు శక్తులను ఎలా ఎదుర్కొన్నాడో, మన సైనికులు కూడా అజేయస్ఫూర్తితో నక్సలిజం వంటి దుష్టశక్తులను సమూలంగా నిర్మూలిస్తున్నారు. ఈ యుద్ధంలో పాల్గొన్న ప్రతి జవాను మన రామసేనలోని ఒక యోధుడు” అని చెప్పారు.
మోదీ లేఖలో మరో ముఖ్యాంశం దేశ అభివృద్ధిలో మార్పు వైపు నడుస్తున్న సామాజిక వాతావరణం. “ఇటీవలి సంవత్సరాల్లో హింసను వదిలి రాజ్యాంగంపై విశ్వాసం ఉంచిన వారు కొత్త దిశలో అడుగులు వేస్తున్నారు. ఇది మన సమాజం మారుతున్నదానికి సంకేతం. ఈ దీపావళి కేవలం ఇళ్లలో దీపాలు వెలిగించడమే కాదు, ఆ మార్పు దీపం ప్రతి మనసులో వెలగాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
అలాగే పేదల సంక్షేమం, మహిళా సాధికారత, గ్రామీణ అభివృద్ధి, యువత అవకాశాలపై దృష్టి ఈ లేఖలో మోదీ దేశ ప్రజలను “వికసిత భారత్ 2047” లక్ష్యం వైపు నడవాలని పిలుపునిచ్చారు. “ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించి, చిన్నచిన్న మార్పుల ద్వారా దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలి. రాముడి స్ఫూర్తితో న్యాయం, సత్యం, ధర్మం పట్ల కట్టుబడి ఉండాలి” అన్నారు.
మోదీ లేఖ చివరగా, “మన ఇళ్లలో వెలిగే ప్రతి దీపం, ఒక సైనికుడి ధైర్యానికి, ఒక రైతు కష్టానికి, ఒక తల్లిదండ్రి త్యాగానికి గుర్తుగా ఉండాలి. ఇదే నిజమైన దీపావళి స్ఫూర్తి” అని పేర్కొంటూ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.