అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్టోబర్ 8న జరిగిన బాణాసంచా పేలుడు ఘటన రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

సచివాలయంలో సీఎం చంద్రబాబు, హోమ్ మంత్రి అనిత, అధికారులు సురేష్ మరియు ఆకే రవికృష్ణలతో సమావేశమై ఘటనపై సమగ్ర నివేదికను స్వీకరించారు. ఆ నివేదికలో, ఒకే షెడ్డులో 14 మంది కార్మికులు ప్రమాదకర పదార్థాలతో పనిచేస్తుండగా, హార్డ్ మెటీరియల్ వాడటం వల్ల స్పార్క్ వచ్చి పేలుడు సంభవించిందని తెలిపారు. తయారీ కేంద్రంలో భద్రతా నిబంధనలు పూర్తిగా పాటించలేదని నివేదిక పేర్కొంది.
ఈ వివరాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. బాణాసంచా తయారీ కేంద్రాలకు లైసెన్సులు జారీ చేసే ముందు నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తున్నారా లేదా అన్నది తరచూ తనిఖీ చేయాలని ఆయన సూచించారు. అలాగే, అన్ని తయారీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ జరగాలని ఆదేశించారు.
ఎక్స్ప్లోసివ్ పదార్థాల కొనుగోళ్లు ఇకపై ఆన్లైన్లో మాత్రమే జరగాలని సీఎం పేర్కొన్నారు. బాణాసంచా తయారీ మరియు విక్రయాలపై కఠిన పర్యవేక్షణ ఉండాలని, నిబంధనలు పాటించని కేంద్రాలను తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. ఉల్లంఘన చేసిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని కూడా స్పష్టం చేశారు.
బాణాసంచా తయారీ కేంద్రాల్లో పనిచేసే ప్రతి కార్మికుడికి వ్యక్తిగత బీమా తప్పనిసరి చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించడమే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించే మార్గమని ఆయన పేర్కొన్నారు. కోనసీమ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.