- NRI: దుబాయి పోలీసుల అదుపులో జగిత్యాల జిల్లా గల్ఫ్ కార్మికుడు..
- ఇండియాకు వెళ్లకుండా దుబాయి ఏర్ పోర్ట్ లో నిలిపివేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు…
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారం గ్రామానికి చెందిన కట్టు తిరుపతిని ఇండియాకు వెళ్లకుండా దుబాయి ఏర్ పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారులు 'ఎగ్జిట్ క్లియరెన్స్' నిరాకరించి పోలీసులకు అప్పగించిన సంఘటన ఎప్రిల్ 12న జరిగింది. జీవనోపాధి కోసం జనవరి 10న దుబాయికి చేరుకున్న తిరుపతికి యాజమాన్యం జీతం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడంతో... కంపెనీ నుండి వెళ్ళిపోయి ఇతర చోట్ల పని కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. కాగా యజమాని అతన్ని పరారైన కార్మికుడు (ఖల్లివెల్లి) గా ప్రభుత్వం వద్ద నమోదు చేసినట్లు సమాచారం. ఇతని స్వగ్రామం ఎండపెల్లి మండలం చర్లపల్లి, కాగా అత్తవారి ఊరు రాజారంలో నివసిస్తున్నాడు.
తిరుపతికి, ప్రభుత్వం పక్షాన న్యాయవాదిని సమకూర్చి 'న్యాయ సహాయం' (లీగల్ ఎయిడ్,) అందించి, విడుదల చేయించి స్వదేశానికి తెప్పించాలని అతని భార్య రజిత శుక్రవారం (15.05.2026) హైదరాబాద్ బేగంపేట లోని స్టేట్ లెవల్ 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ల పేరిట వినతిపత్రం సమర్పించారు. ఆయనపై ఏవో ఆరోపణలు మోపి శిక్ష విధించే అవకాశం ఉందనే భయం ఉంది. కాబట్టి, ఆయన నిర్బంధానికి గల ఖచ్చితమైన కారణం, ఏవైనా కేసులు, ఆరోపణలు ఉన్నాయా అనే విషయాలను తెలుసుకొని చెప్పాలని ఆమె కోరారు.
స్పందించిన 'సీఎం ప్రజావాణి' ఇంచార్జి, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ డా. జి. చిన్నారెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని జిఏడి ఎన్నారై విభాగం అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' హెల్ప్ డెస్క్ లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, వాలంటీర్ ప్రీతి సువర్చల తదితరులు పాల్గొన్నారు. బాధితున్ని ప్రభుత్వం ఆదుకోవాలని గల్ఫ్ కార్మిక నాయకుడు అమరగొండ తిరుపతి కోరారు.