తెలుగు సంస్కృతి, ఎన్టీఆర్ వారసత్వానికి వేదికైన మలేషియా తెలుగు ఫౌండేషన్ సమావేశం..
వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగంపై ప్రత్యేక సదస్సు..
మలేషియాలో తెలుగు సంస్కృతి, తెలుగు వారసత్వానికి మరోసారి అద్దం పట్టేలా మలేషియా తెలుగు ఫౌండేషన్ (MTF) ఆధ్వర్యంలో వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ఘనంగా నిర్వహించబడింది. ఫౌండేషన్ అధ్యక్షులు దాతో కాంతారావు నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతిష్ఠాత్మకమైన “ఎన్టీఆర్ సజీవ చరిత్ర” పుస్తకావిష్కరణ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అదే సమయంలో వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగంపై ప్రత్యేక సదస్సు నిర్వహించడం కార్యక్రమానికి ప్రత్యేకత తీసుకొచ్చింది.
తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత గాథను ప్రతిబింబించే “ఎన్టీఆర్ సజీవ చరిత్ర” గ్రంథం ఆవిష్కరణ సందర్భంగా సభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. సినీరంగం నుంచి రాజకీయాల వరకు ఎన్టీఆర్ చేసిన విశిష్ట సేవలు, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆయన దూరదృష్టి, ప్రజాసేవ పట్ల అంకితభావం ఈ పుస్తకంలో ప్రతిఫలించాయని పలువురు వక్తలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి భారతదేశం నుండి విచ్చేసిన ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టి.డి. జనార్ధన్ కూడా పాల్గొని సభకు విశిష్టతను చేకూర్చారు. ఎన్టీఆర్ గారి జీవితం తెలుగు ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
సభలో అభిమానులు, సామాజిక నాయకులు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా అధ్యక్షులు బూరెడ్డి మోహన్ రెడ్డి, ప్రతినిధులు రవివర్మ, శివ, మంగపతి, అలాగే తెలుగు ఎక్స్పాట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా ప్రతినిధులు నాగరాజు, ఇంద్రనీల్, శైలేంద్ర తదితరులు హాజరై కార్యక్రమాన్ని అభినందించారు.
భారత్–మలేషియా మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో మలేషియా తెలుగు ఫౌండేషన్ చేస్తున్న కృషిని పలువురు నాయకులు ప్రశంసించారు. విదేశాల్లో తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించడంతో పాటు యువతలో తెలుగు వారసత్వంపై అవగాహన పెంచేందుకు MTF చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
అంతేకాకుండా, వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగంపై నిర్వహించిన ప్రత్యేక సదస్సు కూడా అందరినీ ఆకట్టుకుంది. ఆధునిక సాంకేతికతతో వ్యవసాయ రంగంలో కొత్త మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని నిపుణులు వివరించారు.
“ఎన్టీఆర్ సజీవ చరిత్ర” పుస్తకావిష్కరణ విజయవంతంగా నిర్వహించడం ద్వారా తెలుగు వారసత్వ పరిరక్షణ, సాంస్కృతిక ఐక్యత, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే సమాజ సేవ పట్ల తమ అంకితభావాన్ని మలేషియా తెలుగు ఫౌండేషన్ మరోసారి చాటిచెప్పింది.