తెలుగు సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించే వేడుక..
ముఖ్య అతిథులుగా పద్మశ్రీ మురళి మోహన్, పద్మభూషణ్ నోరి దత్తాత్రేయుడు..
న్యూజెర్సీ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం నార్త్ అమెరికా తెలుగు సొసైటి ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ‘నాట్స్ కల్చరల్ ఫెస్టివల్’ అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించే ఈ వేడుక మే 17న ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఫోర్డ్స్లోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ లో జరగనుంది.
ఈ సాంస్కృతిక ఉత్సవానికి ప్రముఖ సినీ నటుడు, పద్మశ్రీ మురళి మోహన్, వైద్య రంగ ప్రముఖుడు పద్మభూషణ్ నోరి దత్తాత్రేయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వారి సమక్షంలో కార్యక్రమం మరింత ప్రత్యేకంగా మారనుంది.
అలాగే యువ గాయకులు హర్షిత యార్లగడ్డ, అద్వైత బొండుగుల తమ సంగీత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. చిన్నారుల నృత్యాలు, కళాత్మక ప్రదర్శనలు, మాతృదినోత్సవ వేడుకలు, ‘తెలుగు అమ్మాయి’ ట్రోఫీ ప్రదానోత్సవం వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
వేడుకలో భాగంగా షాపింగ్ స్టాల్స్, రుచికరమైన విందు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రవేశం పూర్తిగా ఉచితంగా ఉండటం విశేషం. తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సాంస్కృతిక వేడుకను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
నాట్స్ ఛైర్మన్ కిశోర్ కంచర్ల, ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, న్యూజెర్సీ చాప్టర్ సభ్యుల పర్యవేక్షణలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాల కోసం నిర్వాహకులను సంప్రదించాలని సూచించారు.