రేపు శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన..
నరసన్నపేటలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా నరసన్నపేట మండలంలో పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.
ముఖ్యమంత్రి ఉదయం 9 గంటలకు ఉండవల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి, ఉదయం 10.40 గంటలకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామ్రపల్లి గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడ స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలకనున్నారు.
అనంతరం నరసన్నపేటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించే ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొని పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, గ్రామాభివృద్ధిపై ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యంగా తీసుకుంటోంది. గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రత పెంపు, పర్యావరణ సంరక్షణ, ప్రజల్లో బాధ్యతాభావం పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. గత 16 నెలలుగా నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
మధ్యాహ్నం 1.20 గంటలకు నరసన్నపేటలోని ఎస్డబ్ల్యూపీసీ షెడ్ సమీపంలో సీఎం ప్రజలతో నేరుగా సమావేశం కానున్నారు. స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రజల అవసరాలపై అక్కడే చర్చించనున్నారు. ప్రజల అభిప్రాయాలు స్వయంగా తెలుసుకుని అధికారులకు అవసరమైన సూచనలు చేసే అవకాశం ఉంది.
ఆ తర్వాత మధ్యాహ్నం 2.10 గంటల నుంచి 3.40 గంటల వరకు తామ్రపల్లి గ్రామంలో నిర్వహించే పార్టీ కేడర్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. పార్టీ శ్రేణులకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడంపై నేతలకు సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం.
సాయంత్రం 3.55 గంటలకు తామ్రపల్లి నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభించి, సాయంత్రం 5.35 గంటలకు ఉండవల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రాంతంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భద్రతతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.