పైలట్ల కొరత, కార్యకలాపాల్లో ప్రణాళికా లోపాలు, కొత్త నిబంధనల అమలు—ఈ మూడు అంశాలు కలసి దేశంలో అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ కార్యకలాపాలను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి. వరుసగా నాల్గో రోజూ శుక్రవారం కూడా వందల సంఖ్యలో విమానాలను రద్దు చేయడంతో, దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు గందరగోళంతో నిండిపోయాయి. వేల మంది ప్రయాణికులు ఆహారం, నీరు లేకపోవడం, కౌంటర్ల వద్ద సిబ్బంది అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలతో గంటల తరబడి పడిగాపులు కాశారు. విమానాలు సిద్ధంగా ఉన్నా, పైలట్ల లేమి వల్ల వాటిని నడపలేకపోతున్న పరిస్థితి ఎయిర్పోర్టుల వద్ద స్పష్టంగా కనిపించింది. ఇది కేవలం కార్యకలాపాల్లో వైఫల్యం మాత్రమే కాదని, యాజమాన్యంలో ఉన్న లోపాలు బయటపడిన సంకేతమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
గత 24 గంటల్లోనే ఇండిగో 550కిపైగా దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది. ముంబైలో 118, బెంగళూరులో 100, హైదరాబాద్లో 75, కోల్కతాలో 35గా భారీ సంఖ్యలో విమానాలు నిలిచిపోయాయి. పుణె, ఢిల్లీ, గోవా వంటి ప్రధాన నగరాలకు రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనితో ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానాలు ఎంచుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికే టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. కొందరు ప్రయాణికులు తమ లగేజీపైనే పడుకుని రాత్రులు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో, ప్రయాణికులు తక్షణమే ప్రయాణం చేయాలని కోరుతూ ఎయిర్పోర్ట్లలో ఆందోళన వ్యక్తం చేయడం పరిస్థితుల తీవ్రతను సూచించింది. "టేలర్ స్విఫ్ట్ కచేరీ టికెట్ కంటే బెంగళూరు ఫ్లైట్ టికెట్ ఖరీదు ఎక్కువైంది" అన్న ప్రయాణికుడి వ్యాఖ్య వైరల్ అయింది.
ఈ పరిస్థితుల్లో డిజీసీఎ (DGCA) రంగంలోకి దిగింది. ఇండిగో యాజమాన్యంతో అత్యవసర సమీక్షా సమావేశాలు నిర్వహించి, కార్యకలాపాలను తక్షణమే గాడిలో పెట్టాలని ఆదేశించింది. పైలట్ల పనివేళలు, విశ్రాంతి సమయాలకు సంబంధించిన కొత్త FDTL నిబంధనలు అమలులో ఎంతమంది పైలట్లు అవసరమో అంచనా వేయడంలో ఇండిగో పూర్తిగా విఫలమైందని డిజీసీఏ స్పష్టం చేసింది. పైలట్ల కొరత ముందే తెలిసినా, యాజమాన్యం సరిపడా శిక్షణ, నియామకాలు చేపట్టకపోవడం ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణమని అధికారులు సూచించారు. ఈ లోపాల వల్ల భారత్లోనే కాక, అంతర్జాతీయ సర్వీసులలో కూడా విఘాతం ఏర్పడింది.
ప్రయాణికుల అసౌకర్యంపై స్పందించిన ఇండిగో, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి మరికొంత సమయం పట్టనుందని తెలిపింది. 2026 ఫిబ్రవరి 10 నాటికి కార్యకలాపాలు పూర్తిగా నార్మల్ అవుతాయని హామీ ఇచ్చింది. అయితే రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని విమానాలు రద్దయ్యే అవకాశం ఉందని, డిసెంబర్ 8 నుంచి సేవలను తగ్గించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ప్రయాణికులు తమ విమాన స్థితిని వచ్చేముందు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించింది. ప్రస్తుతం ఇండిగో ఎదుర్కొంటున్న సంక్షోభం దేశంలోని ఇతర విమానయాన సంస్థలపైనా పరోక్ష ప్రభావం చూపుతుండటం గమనార్హం. టికెట్ ధరల పెరుగుదల, ఫ్లైట్ డీలేలు, రద్దులు ప్రయాణికులకు గట్టి కష్టాలే మిగిల్చాయి.