ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పేదలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆగస్టు 25వ తేదీ నుంచి ఈ కార్డుల పంపిణీ మొదలైంది. మొత్తం నాలుగు దశల్లో ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా, లబ్ధిదారులకు సులభంగా సరుకులు అందేలా ఈ కొత్త కార్డులను ప్రవేశపెట్టారు. ఏటీఎం కార్డు సైజులో ఉండే ఈ స్మార్ట్ కార్డులపై ప్రత్యేకమైన క్యూ ఆర్ కోడ్ను ముద్రించారు. దీన్ని స్కాన్ చేస్తే రేషన్ తీసుకున్న వివరాలు వెంటనే తెలుస్తాయి. అయితే, ఈ సదుపాయం అందిస్తున్నప్పటికీ కొన్ని జిల్లాల్లో స్మార్ట్ కార్డులలో తప్పులు బయటపడ్డాయి.
కొన్ని కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లు తప్పుగా నమోదు చేయడం, బంధుత్వాల స్థానంలో “ఇతరులు” అని ముద్రించడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. మరికొన్ని కార్డులలో ఇంటి అడ్రస్ స్థానంలో అర్థం లేని అక్షరాలు ముద్రించబడ్డాయి. అలాగే కొందరి కార్డులపై ఇంటి యజమాని ఫోటోలు సరిగా ముద్రించబడకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు గల్లంతవడం, ఊరు లేదా మండలం పేర్లలో పొరపాట్లు రావడం వంటి సమస్యలు కూడా లేవనెత్తబడ్డాయి.
ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను కుటుంబ పెద్ద మహిళ పేరుతో జారీ చేయాలని నిర్ణయించినా, కొన్ని చోట్ల పురుషుల పేర్లతో కార్డులు ముద్రించబడ్డాయి. ఈ కారణంగా రేషన్ కార్డులపై తప్పులు ఉంటే సంక్షేమ పథకాలకు దూరమవుతామన్న ఆందోళన లబ్ధిదారుల్లో పెరిగింది. ఇప్పటికే రెండు విడతల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పూర్తవగా, సెప్టెంబర్ 15వ తేదీ వరకు మిగతా రెండు విడతల్లో అన్ని జిల్లాలకూ ఈ కార్డులను పంపిణీ చేయనున్నారు.
ఈ సమస్యలపై పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు. స్మార్ట్ రేషన్ కార్డులలో తప్పులు ఉంటే సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయాలను సంప్రదించాలని సూచించారు. ప్రింటింగ్ లోపాలు లేదా వివరాల పొరపాట్లు ఉంటే, సచివాలయంలో దరఖాస్తు చేసుకుని వాటిని సరిచేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. వెంటనే సచివాలయ సిబ్బందిని సంప్రదిస్తే, తక్షణమే సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
ఇకపై లబ్ధిదారులు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు హామీ ఇస్తున్నారు. తప్పులు ఉన్నా వాటిని సరిచేసుకోవడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. స్మార్ట్ రేషన్ కార్డులు సరైన విధంగా అందరికీ చేరితే, రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరగడంతో పాటు, లబ్ధిదారులకు సులభతరం అవుతుంది.