ఈ మధ్య కాలంలో అమెరికా వాణిజ్య విధానాల గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎక్కువ చర్చలకు కారణమవుతున్న విషయం అందరికీ తెలిసి. విదేశీ సరఫరాదారులపై అసహనం దేశీయ పరిశ్రమకు ప్రాధాన్యం ఇవ్వాలన్న అభిప్రాయం తరచుగా ఆయన ట్రూత్ సోషల్లో వ్యక్తం అవుతూనే ఉంది.
ఇటువంటి నేపథ్యంలో, అమెరికాకు దిగుమతి అయ్యే మీడియం, హెవీ-డ్యూటీ ట్రక్కులపై 25 శాతం టారిఫ్ విధించబోతున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. ఈ టారిఫ్ నవంబర్ 1 నుంచి అమలులోకి రానుంది. దీని కారణంగా భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాల నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ట్రక్కులకు అదనపు 25 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది.
వాస్తవానికి, అమెరికా పెద్ద ట్రక్కుల దిగుమతులపై కొత్త టారిఫ్ అక్టోబర్ 1 నుండి అమలులోకి రానుండగా, అది తాత్కాలికంగా వాయిదా పడింది. ఇప్పుడు ఈ తేదీ ఖరారయింది. ట్రంప్ అభిప్రాయం అమెరికాలో దేశీయ ట్రక్ తయారీ పుంజుకోవడం ద్వారా ఆర్థికంగా ముడిపడి ఉన్న పరిశ్రమకు కాస్త ఉపశమనం లభిస్తుందని తెలిపారు.
ఈ నిర్ణయం ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్, సెక్షన్ 232 ఆధారంగా తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ సెక్షన్ ప్రకారం, జాతీయ భద్రతకు కీలకమైన వస్తువులపై ప్రభుత్వం దిగుమతి పన్నులు విధించవచ్చు. 10,000 పౌండ్లకు పైగా బరువు గల మీడియం, హెవీ-డ్యూటీ ట్రక్కులు మరియు వాటి భాగాలు దీనికి సంబంధించినవి.
ప్రస్తుతం, అమెరికాలోని ప్రముఖ ట్రక్ తయారీదారులు – పీటర్బిల్ట్, కెన్వర్థ్, ఫ్రైట్లైనర్, మాక్ ట్రక్స్ – ఈ టారిఫ్ ద్వారా లాభపడతారని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంచనా వేసింది. విదేశీ ట్రక్కులను కొనడం కంటే దేశీయంగా తయారు చేసుకోవడం వల్ల నష్టమేంటని, అమెరికా పరిశ్రమకు రక్షణ కల్పించడానికి ఈ టారిఫ్ అవసరమని చెప్పారు.
ఇటీవల జపాన్ యూరోపియన్ యూనియన్ దేశాలతో ఉన్న వాణిజ్య ఒప్పందాల ప్రకారం, తేలికపాటి వాహనాలపై 15 శాతం సుంకాలు విధించబడ్డాయి. అయితే కొత్త టారిఫ్ ప్రధానంగా డెలివరీ వాహనాలు, చెత్త తరలించే ట్రక్కులు, ట్రాన్సిట్ బస్సులు, స్కూల్ బస్సులు, సెమీ-ట్రక్కులు, ఇతర హెవీ-డ్యూటీ వాహనాలు లక్ష్యంగా పెట్టింది. చూడాలి మరి ఈ నిర్ణయంతో ట్రంప్ ప్రభుత్వ ఏ విధంగా మలుపులు తిరగనుందో.