ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులతో ప్రారంభం కానున్న డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ రాష్ట్రానికి సాంకేతిక విప్లవానికి నాంది పలకబోతోంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. చంద్రబాబు కలల ప్రాజెక్ట్గా పేరుగాంచిన డ్రోన్ సిటీ ఇప్పుడు సాకారమవుతోంది. ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి మోదీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఈ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం డ్రోన్ సిటీ నిర్మాణానికి పునాది వేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు వెల్లడించారు. అంతేకాక, డ్రోన్ రంగంలో సాధించిన పురోగతిని ప్రజలకు చూపించేందుకు డిసెంబర్లో భారీ డ్రోన్ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇక మరోవైపు, సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ (RTGS), పౌర సేవలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో జరిగిన ఈ సమావేశానికి సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్, ఐటీ, ఆర్టీజీఎస్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వాట్సాప్ గవర్నెన్స్ను విస్తృతంగా వినియోగించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, నేర నియంత్రణ, ప్రజా రక్షణ కోసం సీసీటీవీ కెమెరాలు సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు.
డ్రోన్ల వినియోగం ప్రభుత్వ పరిమితిలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా విస్తృతంగా ఉండాలి అని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవసాయం, వైద్యం, రవాణా వంటి రంగాల్లో డ్రోన్లు విప్లవాత్మక మార్పు తీసుకురాగలవని, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకూ సరుకుల పంపిణీ లో ఇవి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. పౌర సేవలను మరింత సులభతరం చేయాలని ప్రజల సంతోషాన్ని పరమావధిగా తీసుకోవాలని ఆయన సూచించారు.
అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించడానికి ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ వ్యవస్థలను వినియోగించాలని ఆయన ఆదేశించారు. ప్రతి రోజు 19 శాఖల పనితీరు ను సమీక్షించాలనీ నెలవారీగా ఆడిట్లు జరిపి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ కాలంలో రెవెన్యూ (రాజస్వ)రికార్డుల్లో జరిగిన అవకతవకలను సరిదిద్దేందుకు మన ప్రభుత్వం కృషి చేస్తోంది అని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రాభివృద్ధి ప్రయాణంలో టిడిపి ప్రభుత్వం సాంకేతికత అనే దీపాన్ని ప్రగతిపథంలో వెలిగిస్తోంది. నవీనత అనే మంత్రంతో ప్రజాహితమే పరమావధిగా సంకల్పించింది. విజ్ఞానం పరిపాలన, సేవ — ఈ త్రివేణి సంగమంతో సుసంపన్న భవిష్యత్తు దిశగా పరిపాలన జరుగుతుందని తెలిపారు.